సాక్షి, కొత్తపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భవనాలకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారే తప్ప భవనాలను మాత్రం నిర్మించలేదు. నియోజకవర్గంలో రూ.2,800 కోట్లతో అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే వర్మ.. ఈ ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు చేసిన పలు భవనాలను ఇప్పటికీ నిర్మించలేదు. నిధులు విడుదలైనప్పటికీ వాటిని ఎందుకు నిర్మించలేదన్న ప్రశ్నలకు సమాధానాన్ని ఎవరూ చెప్పడం లేదు. నిధులు మంజూరైనా పనులను ప్రారంభించకపోవడంతో సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వర్మ వాకతిప్ప పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి 2017 అక్టోబర్ 29తేదీన శంఖుస్థాపన చేశారు. మండల కేంద్రం కొత్తపల్లి పంచాయతీ భవనం నిర్మాణానికి మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఖాళీ స్థలంలో 2017 నవంబర్ 19న శంఖుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఈ రెండు భవనాలకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాత భవనాలను కూల్చివేసి, కొత్త వాటిని నిర్మించకపోవడంతో ఆ కార్యాలయాలు పరాయిపంచన నడుపుతున్నారు. గోర్స గ్రామం శెట్టిబలిజపేటలో కమ్మునిటీ భవనానికి 2016 నవంబర్ 8న ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టే ఈ భవనాన్ని ఇప్పటికీ నిర్మించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.