సాక్షి, విజయవాడ : వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు సోమవారం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు మధ్యాహ్న భోజనం కోసం ఆ పార్టీ శ్రేణులు చేసిన ఏర్పాట్లు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. చంద్రబాబు లంచ్ కోసం యనమలకుదురు రోడ్డుపై ఆయన బస్సును నిలిపివేశారు. దాదాపు 20 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలపడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో చంద్రబాబు, టీడీపీ నాయకుల తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.