నేతల గళంపై జనం గంపెడాశ

31 Aug, 2014 05:11 IST|Sakshi
  • తాగునీటి కోసం అలమటిస్తున్న జనం     
  •  వేరుశెనగ ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు
  •  గిట్టుబాటు కూలి దక్కని ఉపాధి హామీ పథకం
  •  ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలయ్యేదెప్పటికో?
  •  రుణమాఫీ ప్రకటనతో రైతులకందని కొత్తరుణాలు
  •  7 గంటల ఉచిత విద్యుత్ హుళక్కేనా
  •  నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
  • చిత్తూరు (టౌన్): జిల్లా ప్రజాపరిషత్ కొత్త పాలకవర్గం తొలి సర్వసభ్యసమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ మీటింగ్ హాలులో జరగనుంది. జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళంవిప్పి పరిష్కారం చూపుతారనే గంపెడాశతో జనం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ను తాగునీటి సమస్య తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది.  వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయి.

    గత ఏడాది రైతులకు అందాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇంకా అందలేదు. విభాగాలవారీగా నెలకొన్న సమస్యలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
     
    గ్రామీణ నీటిసరఫరా

    జిల్లాలో 1,202 గ్రామాల్లో  తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 1,043గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా 159 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీటిని అందిస్తున్నారు.-2014-15కు రూ.268.21కోట్ల అంచనాలతో  6,140  తాగునీటి పనులు  మంజూరుకాగా వాటిలో 6,081 పనులను చేపట్టి 4,900 పనులను మాత్రం పూర్తిచేశారు. దీనికోసం రూ.85.38 కోట్లను మాత్రం ఖర్చు చేశారు.  ఇంకా 1,181 పనులు ఆగిపోయాయి. దానికోసం రూ.182 కోట్లు మురుగుతున్నాయి.
     
    పంచాయతీరాజ్
    పంచాయతీరాజ్ పరిధిలో 2013 జూన్ నుంచి మంజూరైన  పనులను ఆపేయాలని ప్రభుత్వం
    అనధికారికంగా ఆదేశించింది. దీంతో కోట్లాది రూపాయల పనులు జిల్లాలో ఆగిపోయాయి.
         
    2014-15లో పీఎంజెఎస్‌వై కింద రూ.70.15 కోట్లతో మంజూరైనా 23 పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు
         
    ఆర్డీఎఫ్ కింద రూ. 24.75 కోట్లతో  గత ఆర్థిక సం వత్సరంలో మిగులు పనులను చేపట్టగా 32 పూ ర్తయి, 27 వివిధ దశల్లో ఉండగా 65 పనులను ఇంకా చేపట్టలేదు.
         
    రూ. 2.61 కోట్లతో జిల్లాలో రెండు హెరిటేజ్ కారి డార్ పనులు మంజూరు కాగా వాటిలో ఒకటి ప్రోగ్రెస్‌లో ఉండగా మరొకటి ఇంకా చేపట్టలేదు.
         
    రూ.11.25 కోట్లతో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో ఇంకా 30 చేపట్టలేదు.
         
    స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద 971 పనులు చేపట్టగా వాటిలో 314 పనులు వివిధ దశల్లో ఉం డగా 657 పనులు ఇంకా ప్రారంభం కాలేదు
         
    రూ.4.58 కోట్లతో మంజూరైన అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల్లో  32 పూర్తి కాగా,  28 ప్రోగ్రెస్‌లో ఉండగా మరో 23 భవనాలను ఇంకా చేపట్టలేదు.
         
    రూ.11.40 కోట్లతో మంజూరైన  62 వెటర్నరీ భ వనాల్లో  11 పూర్తికాగా  22 వివిధ దశల్లో ఉండగా  38 భవనాలను ఇంకా చేపట్టలేదు.
         
    రూ.4.40 కోట్లతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల్లో 44 ఇంకా వివిద దశల్లో వున్నాయి.

    వ్యవసాయశాఖ
    గత ఏడాది  1.75 లక్షల మందికి వేరుశెనగ ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1.08 కోట్లు రావాల్సివుం డగా ఇంతవరకు విడుదల కాలేదు.
         
    గత ఏడాది రైతులకు  పంటలబీమా కింద  వివిధ కంపెనీలు చెల్లించాల్సిన రూ. 102 కోట్లు ఇంతవరకు అందలేదు.
         
    పంటల బీమా పథకంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దుచేసి సెప్టెంబర్ 15 వరకు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలి.
         
    వర్షాభావ కారణంగా పడమటి మండలాల్లో వేరుశెనగ పంట ఎండిపోతోంది. నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందజేయాల్సివుంది.
     
    డీఆర్‌డీఏ
    జిల్లాలో 55,602 సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ. 41.60 కోట్లు చెల్లించాల్సి ఉంది.

    జిల్లాలోని 61వేల సంఘాలకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ కావాల్సివుంది.

    మాఫీ అవుతుందని రుణాలను చెల్లించకపోవడంతో 55వేల సంఘాలు రుణ సదుపాయాన్ని పొందే వీలులేకపోయింది.

    పభుత్వ డెయిరీలు సగటున పాలు లీటరుకు రూ.20-22 మాత్రమే చెల్లిస్తున్నాయి. ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ. 25 నుంచి 27 వరకు చెల్లిస్తున్నాయి. దీంతో బీఎంసీయూల్లో రోజువారీ పాలసేరకణ మూడు నుంచి రెండు లక్షల లీటర్లకు పడిపోయింది.
     
    విద్యుత్ శాఖ
    వ్యవసాయూనికి ఏడు గంటల ఉచిత విద్యుత్  సరఫరా అనేది ఎక్కడా అమలు కావడం లేదు.
         
    ఏడు గంటల ఉచిత విద్యుత్ అనేది అధికారుల లెక్కల్లో ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూ డు గంటలు సరఫరా ఇస్తున్నామంటున్నారు. కానీ రెండు సార్లుగా ఇచ్చే కరెంటు  గంటకోసారి ప్ర కారం నాలుగైదుసార్లు అంతరాయం కలుగుతోం ది. సరిగ్గా అయిదు గంటలు కూడా సరఫరా కావడం లేదు.
         
    ఇంకా 67 వేల వ్యవసాయ సర్వీసులకు హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సపరేట్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయలేదు.
     
    సంక్షేమం
    జిల్లాలో మొత్తం 209 హాస్టళ్లుండగా 75 శాతం హాస్టళ్లకు మంచినీటి కొరత తీవ్రంగా ఉంది.
         
    బీసీ సంక్షేమంలో 37,420 మంది  బీసీ,ఈబీసీ విద్యార్థులకు గాను గత ఏడాదికి మంజూరు కావాల్సిన రూ.79.28 కోట్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు  ఇంకా అందలేదు.
         
    గత ఏడాదికి సంబంధించిన పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పుల కింద 44,194 మందికి రూ. 10.93 కోట్లు విడుదల కావాల్సివుంది
         
    2013-14కు బీసీ కార్పొరేషన్‌లో మార్జిన్‌మనీ పథకం కింద 1,093 మందికి మంజూరైన రూ.3.51 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది.  రాజీవ్ అభ్యుదయ యోజన కింద 145మందికి రూ. 50.49 లక్షల రాయితీని ప్రభుత్వం నిలిపేసింది.
         
    మైనారిటీ సంక్షేమంలో  2012-13కు 2,890 మందికి  ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు కలిపి రూ. 2.50 కోట్లు, గత ఏడాదికి 12,360 మందికి  మంజూరు కావాల్సిన మొత్తం రూ. 20.50 కోట్లు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
     
    ఐసీడీఎస్
    జిల్లాలో మొత్తం 4,768 అంగన్‌వాడీ కేంద్రాలుం డగా 1,404కు మాత్రమే సొంత భవనాలున్నా యి. మిగిలినవన్నీ అద్దెభవనాల్లో నడుస్తున్నాయి.
         
    బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాల్సిన ఐసీడీఎస్ అధికారులు దాన్ని పూర్తిగా మరిచిపోయారు.
     
    డ్వామా
    ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6,38,637 కుటుంబాలకు జాబ్ కార్డులిచ్చినా ఇప్పటివరకు 1,43,385 కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు.
         
    కూలి రేటు తక్కువగా ఉండడంతో రోజంతా పనిచేసినా గిట్టుబాటు కాపోవడంతో పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో జిల్లాలో ఈ పనులు దాదాపుగా స్తంభించాయి.
     
    రుణమాఫీ
    జిల్లాలో  8.7 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు కావాల్సివుంది.  వీరు తీసుకున్న రూ. 11,180  కోట్లు మాఫీ కావాల్సివుంది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. కొత్త రుణాలిచ్చేందుకు ఏ బ్యాంకూ ముందుకు రావడం లేదు. డీసీసీబీ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పంట రుణాలను ఇవ్వలేదు.
     

మరిన్ని వార్తలు