‘మూడు రాజధానులపై సర్వత్రా హర్షం’

18 Dec, 2019 14:38 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల దిష్టిబొమ్మను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటనను హర్షిస్తూ.. విశ్వవిద్యాలయంలో సీఎం జగన్‌ చిత్రపటానికి వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు పాలాభిషేకం చేశారు. 

అదే విధంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని.. టీడీపీ ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని అనంతపురం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ నిర్ణయం వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. జ్యుడీషియల్‌ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానన్న సీఎం జగన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలో అధ్యక్షుడు గురుప్రసాద్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి, రిటైర్డ్ జిల్లా జడ్జి కృష్ణప్ప పాల్గొన్నారు. కర్నూలులో జ్యుడీషియల్‌  క్యాపిటల్ ఏర్పాటు చేయవచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటనపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అనంపురం జిల్లా రిటైర్డ్‌ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని.. రాయలసీమలో జ్యుడీషియల్‌ క్యాపిటల్ ఏర్పాటు చేయటం హర్షణీయం అన్నారు. అధికార వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు వల్ల అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతామని.. రాయలసీమలో జ్యుడీషియల్‌ క్యాపిటల్ ఏర్పాటు వల్ల శ్రీభాగ్ ఒప్పందాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేసినట్లు అవుతుందని అన్నారు. వైఎస్ జగన్ అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

విశాఖపట్నంను ఎక్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డ ప్రకటనపై విశాఖపట్నం మద్దిలపాలెం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలోసీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి  వీరభద్రరావుతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దాడి సత్యనారాయణ, రవిరెడ్డి, బోని శివరామకృష్ణ, స్వర్ణ, అరుణ శ్రీ పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు