పదిరోజులూ ప్రజాగ్రహమే

12 Jan, 2019 08:37 IST|Sakshi
ఉరవకొండ సభలో వైఎస్సార్‌ సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు

ముగిసిన ‘జన్మభూమి– మాఊరు’

సమస్యలపై ఎక్కడికక్కడ అధికారుల నిలదీత

జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తిన అర్జీలు

అనంతపురం అర్బన్‌: ప్రచార ఆర్భాటం కోసం ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలో చేపట్టిన ‘జన్మభూమి– మా ఊరు’ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. తొలిరోజు నుంచి చివరి రోజు వరకు సమస్యల పరిష్కారానికి ప్రజలు అధికారులను నిలదీశారు. సమస్యల పరిష్కారానికంటే ప్రజాప్రతినిధుల ఊకదంపుడు ఉపన్యాసాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో జనం సభలకు వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అధికారులు పింఛను తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులతో సభలు నడిపించారు. చాలాచోట్ల సభలు అధికారపార్టీ కార్యక్రమాలను తలపించాయి. సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఎందుకీ కార్యక్రమాలు... సభలు అంటూ కొన్ని చోట్ల రైతులు, ప్రజలు ‘జన్మభూమి’ సభలను బహిష్కరించారు. ఇక సమస్యలపై నిలదీసిన ప్రజలపై అ«ధికారపార్టీ నాయకులు తమ ప్రతాపం చూపారు. బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంటలో జరిగిన సభలో సమస్యలపై నిలదీసిన వారిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఏకంగా తిట్ల దండకం అందుకున్నారు. తనను ప్రశ్నించిన వారిని మెడ పట్టి గెటించారు. ఇక శింగనమల ఎమ్మెల్యే యామినీబాలను,  కదిరి ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషాను పలు సభల్లో జనం సమస్యలపై నిలదీశారు. శుక్రవారం ఉరవకొండలో జరిగిన సభ రసాభాసగా సాగింది. నిరుపేదలకు ఇంటి పట్టాలివ్వాని వైఎస్సార్‌ సీపీ నేతలు జన్మభూమి సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా..పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

సమస్యలపై 23,921 అర్జీలు
జిల్లావ్యాప్తంగా 10 రోజులపాటు జరిగిన జ న్మభూమి సభల్లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 23,921 అర్జీలు అందాయి. అర్జీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి చేస్తే ఈ సంఖ్య మరికొద్దిగా పెరిగే అవకాశం ఉం ది. ఇక వీటితో సంబంధం లేకుండా అనంతపురం అర్బన్‌లో 934, రూరల్‌లో 3,476 అర్జీ లు అందాయి. అందిన అర్జీల్లో అప్పటికప్పు డు 1,105 పరిష్కరించామనీ, 14,693 అర్జీలను పరిశీలన పూర్తి చేశామనీ, 6,239 అర్జీ లు పరిశీలన చేయాల్సి ఉందని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అందిన అర్జీల్లో 1,884 అర్జీలను తిరస్కరించారు. నియోజకవర్గాల వారీ గా చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో అత్యధికంగా 4,867 అర్జీలు రాగా పుట్టపర్తిలో అత్యల్పంగా 903 అర్జీలు అందాయి. 

>
మరిన్ని వార్తలు