భయం వద్దు.. భవిష్యత్‌ మనదే..

21 Aug, 2018 07:00 IST|Sakshi
జగన్‌తో కలిసి నడుస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ,జల్లూరులో జగన్‌తో సెల్ఫీ దిగుతున్న యువతి

సాక్షి, విశాఖపట్నం :చిరునవ్వుతో, ఆత్మీయంగా పలకరించే రాజన్న ప్రతిరూపాన్ని చూస్తే తమ ఇంటివాడేననే అభిమానం.. ఎండయినా, వానయినా, ఒంట్లో నలత ఉన్నా, కాలికి గాయమైనా పట్టించుకోకుండా ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు వచ్చిన ఆయన్ను చూస్తే తమకు భవిష్యత్తులో ఇంక దేనికీ చింత ఉండదు అనే నమ్మకం కనిపించాయి ప్రజల్లో. తమ పిల్లలకు ఓనమాలు దిద్దించాలని వచ్చిన తల్లిదండ్రులు, అన్నా నీ హయాంలో డాక్టర్‌నై సేవలందిస్తా అనే ఓ చెల్లెలు, నిన్ను చూస్తే చాలు అంటూ చక్రాల కుర్చీల్లో వస్తున్న దివ్యాంగులు, అధికారపార్టీ ఆగడాలకు హద్దే లేకుండా పోతుందనే ఆవేదనను తెలిపేందుకు వచ్చే భూ బాధితులు, .. ఇలా తమ గోడు చెప్పుకుని నీవే న్యాయం చేయాలి అంటే.. ‘ఆందోళన చెందకండి మీకు నేనున్నా.. భవిష్యత్‌ మనదే..’ అంటూ భరోసా ఇస్తూ ముందుకుసాగారు జగన్‌మోహన్‌రెడ్డి. ఆ నమ్మకమే మీ దగ్గరికి నడిపించిందంటూ ఆయన్ను కలిసిన ప్రతిఒక్కరూ అంతే ధైర్యంతో వెనుదిరిగారు.

నా కొడుకు వస్తాడు..రూ.2వేల పింఛన్‌ ఇస్తాడు
సాక్షి, విశాఖపట్నం:నా పెద్ద కొడుకు జగన్‌ బాబు తప్పకుండా అధికారంలోకి వస్తాడు. నాకు రూ.2వేల పింఛన్‌ ఇస్తాడు. ఇప్పుడు ఇస్తున్న రూ.1000 కనీసం మందులకు కూడా చాలడం లేదు. జగన్‌బాబు రావాలి..  మా జీవితాలు బాగుపడాలి. ఆ బాబును చూడడానికి ఆరోగ్యం సహకరించక పోయినా యండపల్లి శివారు నుంచి నడిచి వచ్చాను. బాబును చూశాను. చల్లంగ ఉండాలి.. అధికారంలోకి రావాలని దీవించాను.   – పెట్ల కొండమ్మ, వృద్ధురాలు,యండపల్లి, కోటవురట్ల మండలం

పల్లెల్లో మంచి వైద్యంఅందించాలన్నా..
మా గ్రామంలో ప్రతి ఇంట్లో ముగ్గురు, నలుగురు జ్వరాలు వచ్చి మంచం పట్టారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోయినా పట్టించుకోకపోవడంతో దోమల వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. వైద్యశిబిరాలు పెట్టకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.వేలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోవలసి వస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో వైద్యం సక్రమంగా అందేలా చూడాలన్నా.
–మాడెం వెంకటగోవింద, పి.కొత్తపల్లి, కోటవురట్ల మండలం

సీపీఎస్‌ రద్దు చేయాలన్నా
నేను ఉపాధ్యాయుడిగా చేరి పదేళ్లయింది. ప్రభుత్వం సీపీఎస్‌ విధానం అమలు చేయడంతో రిటైరయ్యాక నా విశ్రాంతజీవితానికి భరోసా లేకుండా పోయింది. మీపైనే నమ్మకం పెట్టుకున్నాం. మీరు అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేయాలన్నా. – కె.లక్ష్మీరాజు, ఉపాధ్యాయుడు, మాకవరపాలెం మండలం  

నిరుద్యోగ భృతి పెంచాలన్నా!
నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు యువతను వంచిస్తున్నారు. నెలకు రెండువేల రూపాయలని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. ఎలా సరిపోతుంది? ఆ ఇచ్చే వెయ్యికి బోలెడు నిబంధనలు. మీరు అధికారంలోకి వచ్చాక ఆ మొత్తం పెంచాలన్నా. – బైలపూడి నాని, నిరుద్యోగి, గొలుగొండ మండలం

వేతనాలు పెంచలేదన్నా
నేను పుట్టుకతోనే వికలాంగురాలిని. అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నా. మాకు ప్రస్తుతం రూ.7000 వేతనం చెల్లిస్తున్నారు. జీతం రూ.10వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ప్రకటించి ఐదు నెలలైనా అమలు కాలేదు. నాకు రెండు కాళ్లు పని చేయకపోవడంతో చక్రాల బండిమీదే ఒకరి సహాయంతోనే ఎక్కడికైనా వెళ్లాలి. జగనన్నని కలిస్తే న్యాయం జరుగుతుందని వచ్చాను.
– సిహెచ్‌.సోములమ్మ, అంగన్‌వాడీ కార్యకర్త,జల్లూరు, కోటవురట్ల మండలం
 
జీవనాధారమైన భూమినికబ్జా చేశారు
నాకు ఇందిరాగాంధీ హయాంలో ఎకరా 83 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ భూమిని సాగు చేసుకుంటూ నలుగురు పిల్లలను పోషించుకుంటున్నాను. ఈ భూమిని అధికారపార్టీ నేతల అండతో కబ్జా చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. జీవనం కూడా గడవట్లేదు. నా భూమిని తిరిగి ఇప్పించాలని జగన్‌ను కోరాను. ఆయన వస్తే మాకు ఆ భూమి తిరిగి వస్తుందని నమ్మకం ఉంది.
– పెదపూడి కొండమ్మ, పి.కొత్తపల్లి,కోటవురట్ల మండలంవైఎస్సార్‌ అభిమానినని

పింఛన్‌ ఇవ్వట్లేదు
నా భర్త మరణించి నాలుగేళ్లయింది. నాకు వైఎస్సార్‌ అంటే చాలా ఇష్టం. కూలిపనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాను. నాలాంటి వారందరికీ పింఛన్‌ ఇస్తున్నారు, నాకు మాత్రం ఇవ్వట్లేదు. జగన్‌మోహన్‌రెడ్డికి నా సమస్య చెప్పుకున్నా. కొద్దికాలం ఓపిక పట్టమ్మా.. మన ప్రభుత్వంలో అందరికీ మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.– పెట్ల ఉమాదేవి, ధర్మసాగరం

జగనన్నంటే చాలా ఇష్టం
నేను పుట్టుక నుంచి వికలాంగుడిని. రెండు కాళ్లు పనిచేయవు. ఎక్కడికి వెళ్లాలన్నా వీల్‌చైర్‌లోనే. నాకెవరూ లేకపోవడంతో  ఇమ్మాన్యుయేల్‌ మినిస్ట్రీస్‌ చేరదీసింది. ఎంఏ బీఈడీ చేశాను. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. వికలాంగుడి కోటలో కూడా నాకు ఉపాధి చూపట్లేదు. జగనన్నంటే ఎంతో ఇష్టం నాకు. ఆయన్ను కలిసి నా సమస్య చెప్పుకున్నా. ఆయన సీఎం అయితేనే మాలాంటివారికి భరోసా దొరుకుతుంది.       – షేక్‌ దర్గాబాబు, వికలాంగుడు,తామరం, మాకవరపాలెం మండలం

మీ హయాంలో ప్రభుత్వాస్పత్రిలోడాక్టర్‌గా చేయాలనుంది
మాది పేదకుటుంబం. ఇంటర్‌ చదివి నీట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాను. నాకు డాక్టర్‌ కావాలని ఉంది. వైఎస్సార్‌ కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రవేశపెట్టిన ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకం ఎంతోమందికి మేలు చేసింది. నేను డాక్టర్‌ని అయ్యాక జగనన్న హయాంలో ప్రభుత్వాస్పత్రిలో పేదలకు సేవ చేయాలని ఉంది.          – మాతే లక్ష్మి, విద్యార్థిని,యండపల్లి గ్రామం, కోటవురట్ల మండలం

రూ.1.60 లక్షల రుణం మాఫీ కాలేదు
నేను గతంలో సహకార బ్యాంకులో రూ.1.60 లక్షలు రుణం తీసుకున్నాను. చంద్రబాబునాయుడు తాను అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీరెవరూ కట్టొద్దని చెప్పాడు. నమ్మేసి కట్టడం మానేశాను. బ్యాంకుల్లో వడ్డీ పెరిగిపోతోంది. చంద్రబాబు వచ్చాక రుణం మాఫీ చేయలేదు. బ్యాంకోళ్లు అసలు, వడ్డీ కట్టమని మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. రుణమాఫీ కోసం అమరావతి వెళ్తే మాఫీ బాండ్లు ఇస్తారని చెప్పారు. మూడు సార్లు వెళ్లినా బాండ్లు ఇవ్వలేదు. ఒక్కపైసా మాఫీ కాలేదు. ఏం చేయాలో తోచడం లేదు. అప్పు పెరిగిపోతోందని పాదయాత్రలో జగన్‌ను కలిసి మొరపెట్టుకున్నా. మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వాళ్లను ఆదుకోవాలని వేడుకున్నా.– అమిరెడ్డి రాజుబాబు, యండపల్లి

మరిన్ని వార్తలు