గుంటూరు:వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు వైఎస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కసుకర్రు సమీపంలో వడ్డెర సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రమజీవులైన వడ్డెరలను ఎస్టీల జాబితాలో చేరుస్తామంటూ ఎన్నికల ముందు వాగ్దానం చేసిన టీడీపీ మాట తప్పిందని ఆరోపించారు. కేంద్రం వడ్డెరలను సంచారజాతులుగా గుర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వం అలా పరిగణించకపోవడం శోచనీయమన్నారు.
వడ్డెర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాదవశాత్తూ కార్మికులు మరణిస్తే ఎక్స్గ్రేషియా, బీమా సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు. వైఎస్ హయాంలో వడ్డెరలకు ఒక ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్, రాష్ట ఫారెస్టు బోర్డు డైరెక్టర్తో పాటు నాలుగు మునిసిపల్ చైర్పర్సన్ పదవులు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. ‘వడ్డెరలకు మీరైతేనే న్యాయం చేయగలరు’ అని విజ్ఞప్తిచేశారు. వల్లెపు నాగేశ్వరరావు, మల్లె ఈశ్వరరావు, వేముల శివపార్వతి తదితరులు జననేతను కలిశారు.