కృష్ణా జిల్లా : రాష్ట్రంలో దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయశాఖ నాయీ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు ఆదివారం వైవీరావు ఎస్టేట్స్లో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఎనిమిది పెద్ద దేవాలయాల్లో 600 మంది టిక్కెట్ కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రాందాసు జననేతకు వివరించారు. తమకు నెలంతా కష్టపడ్డా ఐదారు వేలు మించి ఆదాయం రావడం లేదని, అయితే దేవాలయాలకు మాత్రం తలనీలాలు, టిక్కెట్ల విక్రయం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. తమకు కనీసం రూ.15వేలు నెలవారీ జీతం ఇప్పించాలని కోరారు. మనందరి ప్రభుత్వంలో నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేస్తానని జననేత హామీ ఇచ్చారు.