కరెంటులేక.. దాహం తీరక

27 May, 2014 23:57 IST|Sakshi

దాచేపల్లి, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి వీచిన బలమైన ఈదురుగాలులకు, భీకరమైన వర్షానికి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాచేపల్లి మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
 
 మండలంలోని తాగునీటి పెలైట్ ప్రాజెక్ట్‌లు, ఇళ్లల్లోని తాగునీటి మోటార్లూ పనిచేయక తాగునీటికి ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. దాచేపల్లి, నడికుడి, కేసానుపల్లి, తక్కెళ్లపాడువాసులు అష్టకష్టాలు పడ్డారు. కేసానుపల్లిలోట్రాక్టర్ ద్వారా తాగునీరు అందించే మోటర్‌కు కనెక్షన్ ఇచ్చి మూడుగంటల పాటు నీటిని అందించారు. దీంతో కొళాయిల దగ్గర జనం బారులు తీరారు.
 
 స్పందించిన గీతాగురుకులం యజమాన్యం
 ప్రజల దాహార్తి తీర్చేందుకు మండలంలోని కేసానుపల్లిలోని గీతాగురుకులం హైస్కూల్ యజమాన్యం మంగళవారం స్పందించింది. కరస్పాండెంట్ అనిశెట్టి సాంబశివరావు హైస్కూల్లోని జనరేటర్ ద్వారా తాగునీటి మోటర్‌కు కనెక్షన్ ఇచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలు హైస్కూల్ నుంచే నీటిని తెచ్చుకున్నారు.
 
 చెరువు బాటపట్టిన జనం
 తాగునీటి కోసం ప్రజలు చెరువుబాట పట్టారు. మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం వాసులు చెరువుల వద్ద క్యూకట్టారు. ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలు, ఆటో, ట్రాక్టర్ల సాయంతో నీరు తెచ్చుకున్నారు. ముత్యాలంపాడులోని చెరువు నుంచి దాచేపల్లి, తంగెడ గ్రామాల ప్రజలు కూడా నీళ్లు తీసుకెళ్లారు. కాట్రపాడు, భట్రుపాలెం, రామాపురం, పోందుగల, శ్రీనగర్ గ్రామాల ప్రజలు కృష్ణానది నుంచి నీటిని తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు