కుండపోత వర్షంలోనూ ఉప్పొంగిన జనకెరటం
సమస్యలు వింటూ..భరోసా ఇస్తూ సాగిన పాదయాత్ర
సాక్షి,విశాఖపట్నం : గుండె గడపకు పండగొచ్చింది. హృదయం ఉప్పొంగింది. జగనానందభరితమైంది. శ్వేతవర్ణకపోతమై దూసుకొస్తున్న రేపటి ఉషస్సును చూసి నయవంచక పాలకుల చెర విరగడం తథ్యమని నినదించింది. ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ‘ఆనంద’పారవశ్యమైంది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వానలో తడిసి ముద్దవుతూనే చక్కటి చిరునవ్వుతో నడిచొస్తున్న బహుదూరపు బాటసారిని చూసి సంబరపడింది. జోరు వానలో సైతం జననేత వెంట కదులుతున్న జన సైన్యం అడుగుల చప్పుడు చూసి వరుణుడు కూడా చిన్నబోయాడు. ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 263వ రోజు ఆదివా రం పెందుర్తి మండలంతోపాటు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల పరిధిలోని పల్లెలమీదుగా సాగింది.
ఎంపీ వి.విజయసాయిరెడ్డి, విశాఖపార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, పెందుర్తి, భీమిలి కో ఆర్డినేటర్లు అన్నంరెడ్డి అదీప్రాజు, అక్కరమాని విజయనిర్మల వెంట రాగా పెందుర్తి మండలం దువ్వుపాలెంక్రాస్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. ఎస్.ఆర్.పురం క్రాస్, ఎస్.ఆర్.పురం కాలనీల మీదుగా ఆనందపురం మండలం దబ్బంద వద్ద పాదయాత్ర భీమిలి నియోజకవర్గంలోకి అడుగు పెట్టింది. అక్కడ నుంచి సత్తరవు జంక్షన్, ఎన్జీ ఆర్ పురం, మామిడిలోవక్రాస్, గొంతివానిపాలెం, శొంఠ్యం క్రాస్, దిబ్బడపాలెం మీదుగా గుమ్మడి వానిపాలెం వరకు సాగింది. ఉరుములు.. మెరుపులతో మధ్యాహ్నం బస చేసిన సత్తరవు ప్రాంతమంతా కారుమబ్బులు కమ్మేశాయి. శిబిరం నుంచి బయటకు జననేత అడుగుపెట్టగా నే కుండపోతవర్షంలో తడిసి ముద్దచేసింది. అయినా లెక్కచేయక జనంతో మమేకమవుతూ లక్ష్యం వైపు జననేత దూసుకెళ్లారు. ఆయన సంకల్పాన్ని చూసి బందోబస్తుకు వచ్చిన పోలీసు సిబ్బందితో పాటు సామాన్య ప్రజలు కూడా అచ్చెరువొందారు.
వినతుల వెల్లువ..
మహానేత వైఎస్ హయాంలో ఇందిరప్రభ కింద ఆనందపురం మండలం కుసులువాడలో సర్వే నెం247లో 56కుటుంబాలకు పంపిణీ చేసిన 51 ఎకరాల భూమిలోకి అ«ధికార టీడీపీకి చెందిన భూ భకాసురులు చొరబడి తమను వెళ్లగొట్టారంటూ రైతులు జగన్ను కలిసి మొరపెట్టుకున్నారు. మహానేత పుణ్యమాని విశాఖ స్టీల్ ప్లాంట్ను విస్తరించినా ముడిఇనుము కొరత కారణంగా సామర్థ్యానికి తగినట్టుగా ఉత్పత్తి చేయలేకపోతోందని స్టీల్ప్లాంట్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. విశాఖలో ఏర్పాటు చేయాల్సిన సిడాక్, బయో టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీస్ ఫార్యసూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ను సైతం ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు జననేతను కలిసి వివరించారు.
సంకల్పయాత్రలో పాదయాత్ర ప్రొగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్, అనకాపల్లి పార్లమెంట సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, సమన్వయకర్తలు చిక్కాల రామారావు, కేకే రాజు, డాక్టర్ రమణమూర్తి, కరణం ధర్మశ్రీ, ఉప్పలపాటి రమణమూర్తి రాజు, బడుకొండ అప్పలనాయుడు, సర్రాజు, తలారి వెంకటరావు, సీహెచ్ శ్రీరంగనా«థరాజు, రాష్ట్ర కార్యదర్శులు ప్రగడ నాగేశ్వరరావు, కోలా గురువులు, దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు, సుంకర గిరిబాబు, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి సుకుమార్ వర్మ, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్రాజు, రాష్ట్ర యూత్విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, సీనియర్ నాయకుడు కాకర్లపూడి వరహాలరాజు, ఆడిటర్ జి.వెంకటేశ్వరరావు, భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, మాజీ ఎంపీపీ వెంకటరావు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బి.మోహన్బాబు, నగర అధ్యక్షుడు బి.కాంతారావు, ఎం.కల్యాణ్, పార్లమెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి డోల దేవుడు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి ఐ.హెచ్.ఫరూకీ, నవీన్రెడ్డి, వి.మంజుల, పద్మజరెడ్డి, నిహితరెడ్డి, రాష్ట్ర శాలివాహన సంఘం ఉపాధ్యక్షుడు మండిపూడి పురుషోత్తం, వంగపండు ఉష పాల్గొన్నారు.