మొక్కవోని దీక్షతో జనం చెంతకు జననేత

13 Nov, 2018 07:03 IST|Sakshi

ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మొక్కవోని దీక్షతో మళ్లీ జనం మధ్యకు వచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలంలో ప్రజాసంకల్పయాత్రను సోమవారం పునఃంప్రారంభించారు. జనం నడుమ పాదయాత్ర సాగించారు. గత నెల 25న మక్కువ మండలంలో  పాదయాత్రను ముగించుకుని  హైదరాబాద్‌కు బయలుదేరిన జననేత జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిన విషయం విధితమే. గాయం పూర్తిస్థాయిలో నయంకాకపోగా.. వైద్యులు మరింత విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రజల కష్టాలను తెలుసుకోవాలనే వజ్ర  సంకల్పంతోనే  ప్రతిపక్ష నేత  తన పాదయాత్రను  కొనసాగించారని వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయవ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన పాదయాత్ర ప్రదేశంలో మాట్లాడారు. 

భగవంతుని దీవెనలు, ప్రజల ఆశీస్సులతో పాదయాత్రను చేస్తోన్న జగన్‌మోహన్‌రెడ్డికి జనం నీరాజనం పడుతున్నారన్నారు. ఏ గ్రామానికి వెల్లినా అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పింఛన్లు, ఇళ్లు, భూ సమస్యలను జననేత దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. జగన్‌ సీఎం అయితే వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ అందుతుందని భావిస్తున్నారని తెలిపారు. పార్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో గిరిజనుల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీశారన్నారు. అరకు ఎమ్మెల్యే కుమారుడు శ్రావణ్‌కు మూడు నెలల కాలానికి మంత్రి ఇవ్వడమే  చంద్రబాబు ఎన్నికల జిమ్ముక్కులకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందక విషజ్వరాలతో మరణిస్తున్నా బాబుకు పట్టడంలేదన్నారు. వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తేనే తప్ప ప్రభుత్వ యంత్రాంగం చలించడంలేదని విమర్శించారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం తరువాత పాదయాత్ర పునఃప్రారంభం కావడంతో ప్రజలు, మహిళలు యువత రెట్టింపు ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు వస్తున్నారన్నారు. స్థానికంగా నెలకొన్న  సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.

ఆదుకోవాలయ్యా...
రెండు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాను బాబూ.. నా భర్త టీచరుగా పనిచేస్తూ చనిపోయాడు. నాకు ముగ్గురు కొడుకులు, పెద్ద కొడుకు చనిపోయాడు. రెండవ కొడుకు విజయనగరంలో టీచరుగా పనిచేస్తున్నాడు. మూడవ కొడుకు నిరుద్యోగి. నాకు వచ్చే పింఛన్‌ రూ.9 వేలు మందుల ఖర్చుకు సరిపడడం లేదు. డయాలసిస్‌ను ప్రభుత్వాస్పత్రిలో ఉచితంగా చేస్తున్నా మందులకు డబ్బులు చాలడంలేదు. నువ్వే ఆదుకోవాలయ్యా అంటూ కొయ్యాన పేటకు చెందిన శృంగవరపు మహాలక్ష్మి ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహనరెడ్డిని వేడుకుంది.

మరిన్ని వార్తలు