అడుగడుగునా సమస్యలకు స్పందిస్తూ ముందుకు సాగుతున్న జగన్
ప్రతిపక్ష నేత ఎదుట 104, మోడల్ స్కూల్స్ ఉద్యోగులు, కేశవరెడ్డి బాధితుల గోడు
శ్రీకాకుళం ,అరసవల్లి: ఆదరణ కరువైన వృద్ధులు, రక్షణ లేని అక్కాచెల్లెళ్లు, ఉపాధి దొరకని తమ్ముళ్లు, కష్టానికి తగ్గ ఫలితం లేని కార్మికులు, టీడీపీ అరాచక విధానాలతో అవస్థలు పడుతు న్న బాధితులు.. అందరిదీ ఒకే బాట. ప్రజా సంకల్ప బాట. జగన్మోహన్ రెడ్డి వద్దకు వస్తున్న బాధితులు తమ సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగించారు. పేద ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆ సంకల్ప సూరీడికి చిక్కోలు జనం అభినందనలు తెలుపుతూ మద్దతును ప్రకటిస్తున్నారు.
యాత్రలో పాల్గొన్న నేతలు
పాదయాత్రలో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు జగనన్నను కలిసి, ఆయనతో అడుగులు వేశారు. శ్రీ కాకుళం, విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు, పాలకొండ, కురుపాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, పాముల పుష్పశ్రీవాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతినాగభూషణం, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మజ్జి శ్రీనివాస్, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం, శ్రీకాకుళం, అనకాపల్లి పార్లమెంట్ల నియోజకవర్గ సమన్వయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జెడ్పీ మాజీ చైర్మన్ వైవీ సూర్యనారాయణ, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ ముఖ్య నేతలు మజ్జి శ్రీనివాసరావు, ఎంవీ పద్మావతి, ధర్మాన రామమనోహర్ నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంవి.స్వరూప్, హనుమంతు కిరణ్కుమార్, ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ పాల్గొన్నారు.
పాదయాత్ర సాగిందిలా...
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరం పరిధిలోని ఆదివారంపేట నుంచి యాత్ర ప్రారంభించారు. జనం జగన్ను చూసేందుకు తరలిరావడంతో ఆదివారంపేట ప్రాంతమంతా సందడిగా మారింది. ఇక్కడే భారీగా మహిళలు, యువతులు తరలిరావడంతో ప్రతి ఒక్కరినీ జగన్ ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వారికి భరో సా ఇస్తూనే.. భవిష్యత్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలా ఉంటుందో వివరించారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో వారి కుటుంబాల్లో కూడా ఆనందాలను వ్యక్తం చేస్తున్నారు. అనంతరం యాత్రలో భాగంగా కొత్తరోడ్డు కూడలి, దూసి క్రాస్ మీదుగా రాగోలు వరకు సాగింది. ఈక్రమంలో కొత్త రోడ్డులో కేశవరెడ్డి పాఠశాలల డిపాజిట్ల బాధితులు జగన్ను కలిసి తమ గోడును వెల్లబుచ్చారు. అలాగే 104 వాహనాల ఉద్యోగులు కూడా జగన్ను కలిసి వారి సమస్యలను వివరించారు. ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా జగన్ను కలిసి మోడల్ స్కూళ్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉపా«ధ్యాయులుగా పరిగణించడం లేదంటూ గుంట లక్ష్మీనారాయణ వివరించారు. అలాగే పలు సామాజిక వర్గాల ప్రతినిధులు కూడా జగన్ను కలిసి మద్దతును ప్రకటిస్తూనే.. సంఘాల కార్యాచరణ క్యాలెండర్ను విడుదల చేయించారు. పలువురు ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థినులు జగనన్నతో సెల్ఫీలు దిగేందుకు పోటిపడ్డారు.