జగన్‌ అనే నేను మీ వెన్నుదన్ను

18 Feb, 2019 07:51 IST|Sakshi
ఏలూరులో జరిగిన బీసీ గర్జనకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం (అంతరచిత్రం)వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బీసీలకు వైఎస్‌ జగన్‌ భరోసా

బీసీ గర్జనకు అపూర్వ స్పందన

జనసంద్రమైన హేలాపురి

హర్షధ్వానాల మధ్య డిక్లరేషన్‌ ప్రకటన

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: వైఎసాŠస్‌ర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో ఆదివారం నిర్వహించిన బీసీ గర్జన విజయవంతమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బీసీలు సర్కారు కుటిల రాజకీయాలపై గర్జించారు. జగన్‌ వెంటే తామంటూ నినదించారు. 

ఎండనూ లెక్కచేయక..
సముద్రం ఉప్పొంగిందా.. నేల ఈనిందా అన్నట్టు లక్షలాది మంది ప్రజలు బీసీ గర్జనకు తరలివచ్చారు. ఏలూరులోని సభా ప్రాంగణానికి చేరే దారులన్నీ జన ప్రవాహంతో పోటెత్తాయి. జోతి రావుపూలే సభా ప్రాంగణం జగన్నామస్మరణతో మార్మోగింది.  బీసీ వర్గాలు, యువత, మహిళలు, రైతులు, ఆఖరికి వృద్ధులు, వికలాంగులు సైతం వ్యయప్రయాసలకోర్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేం దుకు.. ఆయన మాటలు వినేందుకు ఉవ్విళ్లూరారు. రోడ్లు ట్రాఫిక్‌తో స్తంభించినా.. పొలాల్లో పడి పరుగులు తీసుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ నేతలు ఊహించినదానికంటే అనూహ్య స్పందన వచ్చింది. మధ్యాహ్నం నుంచే జగన్‌ ప్రసంగం వినేందుకు సభాప్రాంగణంలో ప్రజలు వేచిఉన్నారు.

జగన్‌ అనే నేను..
జగన్‌ అనే నేను...బీసీలకు ఏమి చేస్తానంటే...అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాబోయే సీఎం...జగన్‌ అంటూ యువత కేరింతలు కొట్టారు. ప్రసంగం అడుగడుగునా.. హర్షధ్వానాలు తెలిపారు. టీడీపీ నేతలపై జగన్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడల్లా.. చేతులూపుతూ సంఘీభావం తెలిపారు. బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తున్నప్పుడు ఒక్కొక్క అంశానికి ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు..  తమను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయటమే తప్ప .. బీసీ అభివృద్ధి, సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన టీడీపీతో పోల్చుకుంటూ..ఇక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే నడవాలనే సంకల్పం వారిలో కనిపించింది.  రాజకీయంగానూ అధిక ప్రాధాన్యత ఇవ్వటంపైనా బీసీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
బీసీ గర్జన విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అనూహ్యంగా బీసీ గర్జనకు ప్రజలు తరలిరావడంతో పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇది పార్టీలో ఊపు తెచ్చింది. ధైర్యంగా దూసుకుపోయేందుకు ఇంధనంగా మారింది. ఇదిలా ఉంటే గర్జన విజయవంతంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

బీసీ డిక్లరేషన్‌ ఇలా..
ఏలూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌  ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తామని వెల్లడించారు.
బీసీల సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున 5 ఏళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.
బీసీ సబ్‌ప్లానుకు చట్టబద్ధత కల్పించటంతోపాటు మొదటి బడ్జెట్‌ లో సమగ్ర బీసీ చట్టాన్ని తీసుకుచ్చి మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తామని పేర్కొన్నారు.
కార్పొరేషన్ల వ్యవవ్థను ప్రక్షాళన చేయటంతోపాటు అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్‌ వెల్లడించారు.  
రజకులు, చేనేత, మత్స్యకారులు, బోయలు, వాల్మీకులు, అగ్నికుల క్షత్రియులు, శాలివాహన,. దూదేకుల కొప్పుల వెలమ, శెట్టి  బలిజ, గాండ్ల, ముదిరాజ్, భట్రాజు వంటి బీసీ కులాలకు మొత్తం  139 కార్పొరేషన్లు ప్రారం భిస్తామని చెప్పారు. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసే ప్రసక్తే ఉండదన్నారు.
45–60 ఏళ్ల వయసు కలిగిన ప్రతి మహిళకు రూ. 75 వేలు చేయూత పథకం ద్వారా నాలుగు విడతలుగా అందజేస్తామని పేర్కొన్నారు.
 బీసీ విద్యార్థుల  విద్య కోసం రూ. 20 వేలు, బీసీ పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15 వేలు అందజేస్తామన్నారు.
బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయటమే కాకుండా కమిషన్‌ సిఫార్సులను పక్కాగా అమలు చేస్తామని జగన్‌ చెప్పారు.
పలు కులాలను ఎస్సీ, ఎస్టీలుగా మార్చే విషయాన్ని పరిగణిస్తామని పేర్కొన్నారు.
ప్రైవేటు కాంట్రాక్టు పనులు, అవుట్‌ సోర్సింగ్‌  పనులు  50 శాతం ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు, బీసీలకే వర్తించేలా కొత్త చట్టం తెస్తామని జగన్‌ చెప్పారు.
బీసీలతో రాజకీయంగా బలపడటానికి నామినేటెడ్‌ పదవుల నియామకం చేపడతామన్నారు. కమిటీల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకే ప్రాతినిధ్యం కల్పిస్తామని, నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పారు.
నాయీ బ్రాహ్మణుల దుకాణాలకు ఏటా రూ. 10 వేల సాయం, సంచార జాతులకు ఉచితంగా ఇళ్లే కాదు ఉపాధి సదుపాయం, ప్రత్యేక గురుకుల పాఠశాలల ఏర్పాటు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు, వేటకు వెళ్ళి చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా, చేనేతలకు నెలనెలా రూ.2వేలు పెట్టుబడి నిధి, యాదవుల గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేలు, బ్రాహ్మణులకు కనీస వేతనం వంటి హామీలు ఇచ్చారు. ఆలయ ట్రస్టీలుగా యాదవులు, నాయీ బ్రాహ్మణులను నియమిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు