సందేహాలెన్నో

23 Aug, 2014 01:52 IST|Sakshi
సందేహాలెన్నో

సాక్షి, ఏలూరు : రాష్ర్ట ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బ్యాంకర్లతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.1.50 లక్షల వరకూ పంట రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. వీటి ప్రకారం రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తామని కలెక్టర్ చెప్పారు.
 
ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎన్నిరకాల పంట రుణాలు తీసుకున్నా, వాటన్నింటిని కలిపి రూ.1.50 లక్షల వరకే మాఫీ వర్తిస్తుందన్నారు. 2013 డిసెంబర్ 31 నాటికి రుణం తీసుకుని, 2014 మార్చి 31 నాటికి బకాయి ఉన్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందన్నారు. రైతులు, కౌలు రైతులు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు రుణమాఫీ పథకానికి అర్హులన్నారు. రుణమాఫీలో రైతులకు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే తహసిల్దార్ల సహకారంతో నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలు, చేపల, రొయ్యల చెరువుల సాగుదారులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు.
 
డీసీసీబీ ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతులు 2014 మార్చి 31లోగా రూ.80 కోట్లు మేర రుణాలను చెల్లించారని పేర్కొన్నారు. వీరికి రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గతంలో భూ యజమానులు తీసుకున్న పంట రుణాలు ఇప్పటికీ బకాయి ఉండి, ప్రస్తుతం అదే భూమిపై కౌలు రైతుకు సంబంధించిన పంట రుణాలు బకాయి ఉంటే ఏ రుణాలకు మాఫీ వర్తింప చేయాలనే విషయంలో సందేహం ఉందన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరతామని కలెక్టర్ చెప్పారు. రుణమాఫీకి అర్హత కలిగిన రైతుల వివరాలను వెంటనే అందించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు.
 
రుణ మొత్తాలు కట్టాల్సిందే
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన కారణంగా అర్హత కలిగిన రైతులు  తాము తీసుకున్న రుణాలను తక్షణమే చెల్లించాలన్నారు. రుణాలు చెల్లించినా వారి అర్హత మేరకు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. రుణాల చెల్లింపు ఆలస్యమైతే వడ్డీ రాయితీ పోతుందని, గడువు మీరిన రుణాలపై అపరాధ వడ్డీ పడుతుందని పేర్కొన్నారు. ఈ విషయూలపై బ్యాం కర్లు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జా రుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఆర్డీవోలు కె.ప్రభాకరరావు, శ్రీనివాసరావు, ఉదయభాస్కరరావు, గోవిందరావు, వ్యవసాయ శాఖ జేడీ ఎం.సత్యనారాయణ, డెప్యూటీ డెరైక్టర్ కృపాదాస్, తహసిల్దార్లు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు