ఉద్యమానికి విఘాతం...

10 Jan, 2014 04:27 IST|Sakshi

కొయ్యూరు, న్యూస్‌లైన్: మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ బుధవారం లొంగిపోయిన ఉసెండీ ఉద్యమ ప్రయాణం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్(ఏవోబీ)లోని తాండవ దళం నుంచి ప్రారంభమైంది. ఆయనను అప్పట్లో అప్పన్నగా పిలిచేవారు. ఏడాది పాటు దళ కమాండ ర్‌గా పని చేశారు. 1987 డిసెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా గుర్తేడులో ఏడుగురు ఐఏఎస్ అధికారులను పీపుల్స్‌వార్ గ్రూపు అపహరించిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌తో జైలు నుంచి విడుదలైన వారిలో ఉసెండీ కూడా ఉన్నాడు. విడుదలయ్యాక తాండవ దళ ం కమాండర్‌గా పనిచేశాడు. ఆ తదుపరి ఛత్తీస్‌గఢ్ ఉద్యమ బలోపేతానికి మూడు దశాబ్దాలకు పైగా కృషి చేశాడు.
 
 దండకారణ్య కమిటీ ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రభాత్’ అనే పత్రిక నిర్వహణ బాధ్యతను నిర్వర్తించాడు. వ్యూహ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే ఉసెండీ లొంగుబాటు దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. కాగా, ఒకప్పుడు కీలకమైన నేతలతో బలీయంగా ఉండే  ఏవోబీలో  నేడు గట్టి నేతలే కరువయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు దేవన్న 2007లో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం జైలులో ఉన్న చడ్డా భూషణంతో విభేదాలతో పిల్లి వెంకటేశ్వర్లు అలియాస్ జాంబ్రి 15 ఏళ్ల కిందట లొంగిపోయాడు. నందు కూడా రెండేళ్ల కిందట లొంగిపోయాడు. ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్‌చార్జిగా చేసిన వినయ్ అలియాస్ గోపన్న రాజమండ్రిలో దొరికిపోయాడు. ఇలా కీలక నేతలు తూర్పు డివిజన్ నుంచి కనుమరుగయ్యారు.

>
మరిన్ని వార్తలు