ఆహార అభద్రత

30 Sep, 2013 03:52 IST|Sakshi
 జిల్లాలో ఆహార భద్రత శాఖ పనితీరు దారుణంగా ఉంది. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు సీమాంధ్ర ప్రాంతంనుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆరు నెలల కాలంలో 48 కేసులే నమోదు కావడం, జూన్ 15 తర్వాత ఒక్క కేసూ లేకపోవడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనం.
 
 ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆహార పదార్థాల కల్తీని నిరోధించడంలో ఆహా ర భద్రత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ శాఖ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. గతంలో ఈ శాఖను ఆహార కల్తీ నిరోధక శాఖ అని పిలిచేవారు. 2011 ఆగస్టు 8వ తేదీన ఆహార భద్రత శాఖగా పేరు మార్చారు. అయితే ఈ విషయం శాఖ అధికారులకు తెలియదో, లేదా పట్టించుకోలేదో.. బోర్డు మాత్రం మార్చలేదు. ఇటీవల ఈ విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బోర్డుపై పేరు మార్పించారు. 
 
 సీమాంధ్ర నుంచి అప్ అండ్ డౌన్..
 ఆహార భద్రత శాఖ అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నెలల క్రితం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గంగాధర్ వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానం రెండు నెల ల పాటు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించ లేదు. నెలక్రితం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారిగా అమృతశ్రీ వచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రసాద్, ప్రహ్లాద్‌లు స్థానికంగా ఉండరు. ప్రసాద్ అనే అధికారి విజయవాడనుంచి వచ్చి వెళుతుంటారు. ప్రహ్లాద్ అనే అధికారి కర్నూలునుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీంతో వీరు ఎ ప్పుడు వస్తున్నారో ఎంతసేపు ఉంటున్నారో తెలియని పరిస్థితి. గతంలో జిల్లా ఉన్నతాధికారి లేనందున తనిఖీలు చేయడం లేదని తప్పించుకున్నారు. జిల్లా అధికారి వచ్చిన తర్వాత కూడా వీరు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 48 కేసులే నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 15 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా వంద కేసులు నమోదు చేశామని శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. 
 
 ఫిర్యాదు వస్తే స్పందిస్తాం
 -అమృతశ్రీ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి
 గతంలో జిల్లాలో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి లేకపోవడంతో తనిఖీలు నిర్వహించలేదు. ఫిర్యాదులు వస్తే స్పందిస్తాం. తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం.
 
>
మరిన్ని వార్తలు