మేడారంలో ఇక.. శాశ్వత పనులు

29 Jan, 2014 03:39 IST|Sakshi

హన్మకొండ, న్యూస్‌లైన్: మేడారంలో ఇక... శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర నేపథ్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు పనులు చేస్తున్న విషయం తెలిసిందే.

 జాతర సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఉంటుండడంతో శాశ్వత పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఆరో తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సైతం శాశ్వత పనుల కోసం నివేదికలివ్వాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. మేడారంలో ఎలాంటి పనులు చేపట్టాలి... ఎక్కడెక్కడ చేయాలి... భూ సేకరణ ఎంత అవసరం వంటి అంశాలపై సర్వే చేసేందుకు నాలుగు శాఖలకు నిధులిచ్చారు. అంతేకాకుండా... సర్వే కోసం రూ. పది లక్షలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ మేరకు జిల్లా అధికారులు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే జాతరను పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం శాశ్వత పనులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. దీని కోసం సోమవారం నుంచే అధికారులు సర్వే మొదలుపెట్టారు. జాతర సమయంలోనే కాకుండా... మిగతా రోజుల్లో భక్తుల రాక ఎలా ఉంది... వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలపై సమగ్ర నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యూరు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ సేకరణ, అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు, వారి నుంచి కొనుగోలు తదితర పనుల కోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు.

 శాఖల వారీగా చేపట్టనున్న పనులు
 ఆర్‌డబ్ల్యూఎస్ : మేడారంలో నీటి తిప్పలు లేకుం డా రూ. 11 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు శాశ్వత పనులను చేపట్టనున్నారు. మేడారం చుట్టూ పంట కాల్వల నుంచి లోతుగా (అండర్ గ్రౌండ్) పైపులైన్ నిర్మించి, ప్రధాన దారుల వద్ద నల్లాలు, మినీ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. గుట్టలు, చెట్ల మధ్య విడిది చేసే భక్తులకు ఇబ్బందులు రాకుండా తక్కువ వ్యవధిలోనే నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు.

నీటి సరఫరాకు ఇబ్బం దులు రాకుండా పడిగాపూర్, రెడ్డిగూడెం గుట్టల వద్ద రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు, జంపన్నవాగులో రెండు ఫిల్టర్ బావులను తవ్వనున్నారు. వీటి ద్వారా ట్యాంకులు... అక్కడ నుంచి పైపులైన్లకు లింక్ చేయనున్నారు. వీటి పర్యవేక్షణ కోసం గ్రామపంచాయతీ అనుమతితో ఆర్‌డబ్ల్యూఎస్ మినీ కార్యాలయాన్ని నిర్మించుకోనున్నారు. కొంతమంది సిబ్బందిని కేటాయించనున్నారు.


 ఆర్ అండ్ బీ : మేడారం చుట్టూ ఉన్న ఊరట్టం, రెడ్డిగూడెం, కాల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూర్, నార్లాపూర్, పడిగాపూర్ గ్రామాల నుంచి ప్రధాన రోడ్లను మరింత వెడల్పు చేయడమే కాకుండా... మేడారం వచ్చే ఈ దారుల వెంట ప్రత్యేక ఏర్పా ట్లు చేయనున్నారు. పంట పొలాలకు ప్రమాదం వాటిల్లకుండా రోడ్ల వెంట మురికి కాల్వల నిర్మాణం చేయనున్నారు. అదే విధంగా ప్రధాన ప్రాంతాల్లో నల్లాలను బిగించనున్నారు.

మేడారంలో సమ్మక్కను దర్శించుకున్న భక్తులు  ఈ చుట్టూ గ్రామాల్లో ఎక్కడైనా సేద తీరవచ్చు. జాతర సమయంలోనే కాకుండా... ఈ దారుల వెంట ప్రత్యేక స్తంభాలను వేసి, విద్యుత్ సరఫరా చేసేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

 నీటిపారుదల శాఖ : జంపన్న వాగులో చెక్ డ్యాంల నిర్మాణానికి బ్రేక్ పడనుంది. ఇక్కడ మినీ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇప్పటివరకు సుమారు 10 చెక్ డ్యాంలను నిర్మాణం చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపిం చారు. కానీ.. జాతర సమయంలో కాకుండా వివిధ రోజుల్లో వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నారుు.

ఈ మేరకు జంపన్న వాగును మినీ రిజర్వాయర్‌గా మార్చేందుకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ. 8.8 కోట్లతో మినీ రిజర్వాయర్‌ు నిర్మాణం చేసి, కట్టపైన మినీ పంపింగ్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. జంపన్నవాగు నుంచి స్నాన ఘట్టాలకు లింక్ చేయనున్నారు. దీంతో ప్రతిసారి స్నాన ఘట్టాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే... ఈ ప్రాంతంలోని పంట పొలాలకు కూడా కొంత లాభం చేకూరే అవకాశం ఉంది.  

 విద్యుత్ శాఖ : జాతర సమయంలో స్తంభాలు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టడం వంటి పనులను కాదని... ప్రతిరోజూ వినియోగంలో ఉండే విధంగా రూ. 2.80 కోట్లతో విద్యుత్ పనులను శాశ్వత ప్రాతిపాదికన చేయనున్నారు. మేడారంతోపాటు చుట్టూ గ్రామాల పరిధిలో విద్యుత్ లైన్లు వేయనున్నారు.

 పస్రా నుంచి మేడారం వరకు స్తంభాలు వేయనున్నారు. అంతేకాకుండా ఆర్‌డబ్ల్యూఎస్ తాగునీటి సరఫరాకు 200 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు నిరంతరం నడిచే విధంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇలా అరుుతే.. ప్రతీ జాతర సమయంలో వెచ్చిస్తున్న నిధులు ప్రభుత్వానికి మిగిలే అవకాశముంది. కేవలం ఎనర్జీ చార్జీలు, నిర్వహణ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.

మరిన్ని వార్తలు