నేటి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం షురూ

8 Jun, 2020 08:03 IST|Sakshi
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం

ముందుగా ఉద్యోగులు, స్థానికులకు 

11 నుంచి సాధారణ భక్తులకు 

లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు 

స్వామివారి దర్శనం నిలిచిపోవడం ఇది రెండోసారి

శ్రీవారి దర్శనభాగ్యం కోసం వేయి కనులతో ఎదురుచూస్తున్న భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. వారి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన తిరుమల ఏడుకొండల వాడి దర్శనం సోమవారం నుంచి పునః ప్రారంభం కానుంది. 

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండున్నర నెలల పాటు ఆలయం మూతపడిన విషయం విదితమే. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ట్రైల్‌ రన్‌ నిర్వహించనున్నారు. టీటీడీ ఉద్యోగులు, స్థానికులను దర్శనానికి అనుమతించనున్నారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించేలా టీటీడీ యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతోనే.. 
కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. కచ్చితంగా భౌతికదూరం పాటించాల్సిన ఆవశ్యకత ఉండడంతో క్యూలలో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్‌ వేశారు. తప్పనిసరిగా మాసు్కలు, గ్లౌజులు ధరించేలా నిబంధనలు విధించారు. గంటకు 500 మంది భక్తులకు మాత్రమే దర్శనం కలి్పంచనున్నారు. ట్రైల్‌ రన్‌ కింద టీటీడీ ఉద్యోగులను రెండు రోజులు, ఒక రోజు తిరుమల స్థానికులను దర్శనానికి అనుమతించనున్నారు. దర్శనం సమయంలో ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిచేసుకుని 11వ తేదీ    నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ప్రతిరోజూ ఆరువేల మందికి మాత్రమే దర్శనం భాగ్యం కలగనుంది. ఉదయం 6.30 గంటలకు స్వామివారి దర్శనాన్ని ప్రారంభించి గంట పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనానికి అనుమతించి, అటు తర్వాత సాయంత్రం వరకు సామాన్య భక్తులను అనుమతించనున్నారు. 

తీర్థ ప్రసాదాలు రద్దు 
శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలలో దర్శనానికి భక్తులను అనుమతించకూడదని నిర్ణయించడంతో పాటు తీర్థం, శఠారీలను కూడా టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగానే టైంస్లాట్‌ టోకెను పొందితేనే తిరుమలకు టీటీడీ అనుమతిస్తుంది. ఇందుకోసం అలిపిరి వద్ద ప్రతి నిత్యమూ 3 వేల సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లను జారీ చేయనుంది. భక్తులు ముందురోజే టోకెన్లను పొందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ కు సంబంధించి ప్రతి నిత్యమూ 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనుంది. భక్తుడు దర్శనం స్లాట్‌ను బుక్‌ చేసు కు నే సమయంలోనే తిరుమలలో గదిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. గదికి ఇద్దరు భక్తులు మాత్రమే ఉండేలా నిబంధనలు తేవడంతో పాటు 24 గంటలకు మించి గది కేటా యించకుండా కొత్త విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. 

దర్శనం టికెట్‌ ఉంటేనే తిరుమలకు.. 
దర్శన స్లాట్‌ కలిగిన భక్తులను అలిపిరి కాలిబాట మార్గంలో ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకే అనుమతిస్తారు. శ్రీవారిమెట్టు మార్గంలో కొన్ని రోజుల పాటు భక్తులను అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. కోవిడ్‌ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు, కంటైన్మెంట్, రెడ్‌జోన్‌లోని భక్తులను దర్శనానికి అనుమతించేది లేదని టీటీడీ వెల్లడించింది. ఘాట్‌ రోడ్డులో వాహనాలను ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. వాహనాలను, లగేజీలను శానిటైజేషన్‌ చేస్తారు. తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్‌ వద్ద ర్యాండమ్‌గా ప్రతిరోజూ 200 నుంచి 300మంది భక్తుల నుంచి శాంపిల్స్‌ సేకరించి, కరోనా టెస్టులు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణకట్ట ఉద్యోగులు తప్పనిసరిగా పీపీఈ కిట్‌ ధరించాల్సి ఉంటుంది. అన్నప్రసాద సముదాయంలో రెండు గంటలకొకసారి శానిటైజేషన్‌ చేసేలా చర్యలు చేపట్టారు. 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ 
ప్రభుత్వ ఆదేశాల అమలు తీరును పర్యవేక్షించేందుకు సీని యర్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ లోటుపాట్లను సరిచేయనుంది. తిరుమలలో నిత్యం భక్తులు సంచరించే ప్రాంతాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. శ్రీవారి ఆర్జిత సేవలన్నింటినీ ఏకాంతంగా నిర్వహిస్తారు. 

క్యూలో భక్తులు భౌతిక దూరం పాటించేలా గీసిన గీతలు
స్వామివారి దర్శనం నిలిచిపోవడం ఇది రెండోసారి 
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ముందు జాగ్రత్తగా టీటీడీ మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసింది. దేశవ్యాప్తంగా మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి రాగా టీటీడీ నాలుగు రోజులు ముందుగానే తిరుమలలో అమల్లోకి తెచ్చింది. శ్రీవారి ఆలయంలో 1892లో రెండు రోజుల పాటు స్వామివారి దర్శనం నిలిచిపోయింది. అప్పట్లో జీయంగార్లు, పరిపాలన చూస్తున్న మహంతుల మధ్య ఆలయ తాళాలకు సంబంధించి వివాదం రావడంతో రెండు రోజులు ద్వారాలను మూసేశారు. అటు తర్వాత శ్రీవారి ఆలయంలో సుదీర్ఘ సమయం దర్శనం నిలిచిపోవడం ఇదే. కరోనా వైరస్‌ కారణంగా 80 రోజులు పాటు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిచిపోయింది.  

అడిషనల్‌ ఈఓ తనిఖీలు 
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రయోగాత్మకంగా దర్శనం కల్పించేందుకు చేసిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం టీటీడీ అడిషనల్‌ ఈఓ ఏవీ.ధర్మారెడ్డి తనిఖీ చేశారు. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో 80 రోజుల తర్వాత స్వామివారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులతో కలిసి అదనపు ఈఓ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని క్యూలను, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన మార్కింగ్, శానిటైజర్లు, హుండీ దగ్గర చేసిన ఏర్పాట్లు, భక్తులకు సూచనలు ఇచ్చేందుకు చేయాల్సిన ప్రకటనలు తదితరాలను పరిశీలించారు. 
కాణిపాకం, బోయకొండ ఆలయాల్లో..
కాణిపాకం, బోయకొండ గంగమ్మ ఆలయాల్లో సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు