సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నియమితులయ్యారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను మార్చింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పేర్ని నానిని నియమించింది. ఇదిలా ఉంటే ఉపముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న నేపథ్యంలో బాధ్యతలు ఎక్కువైనందున ఆళ్ల నానికి ఇన్చార్జి మంత్రి పదవి నుంచి ఉపశమనం కల్పించారు. ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆళ్ల నానిని మార్చి మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు.