అందుకే ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు: పేర్ని నాని

7 Dec, 2019 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శనివారం రోడ్లు, భవనాలశాఖ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు. పల్లె వెలుగు.. సిటీ సర్వీస్‌ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ. 10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెకించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

కాగా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకు పోయిందని పేర్ని నాని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచక తప్పట్లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్టీసీ బకాయిలు రూ.6735 కోట్లు ఉన్నాయని, ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తోందని చెప్పారు.  2017-19 పీఆర్సీ పెంచడంతో సంస్థకు భారంగా మారిందని, 2015 నుంచి లీటర్‌ డీజిల్‌పై అదనంగా పెరిగిన రూ.20 భారం సంస్థపై పడుతోందన్నారు. ఆర్టీసీని బతికించాలనే చార్జీలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు ఎప్పటి నుంచి వస్తాయో త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు