ఫార్మసీ సీట్ల కేటాయింపు, 9,106 సీట్లు భర్తీ

24 Sep, 2013 01:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2013 బైపీసీ విభాగం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జాబితా సోమవారం రాత్రి విడుదలైంది. సీట్ల వివరాలను అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చేరవేశారు. ఎంసెట్ బైపీసీ విభాగంలో 85,741 మంది అర్హత సాధించగా.. వారిలో ఫార్మసీ కోర్సుల కోసం 14,724 మంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. అందులో 13,696 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేశారు. రాష్ట్రంలో 9,401 ఫార్మసీ సీట్లు ఉండగా.. 9,106 సీట్లు భర్తీ అయ్యాయి. బీఫార్మసీలో 8,506 సీట్లకుగాను 8,326 సీట్లు.. ఫార్మా-డిలో 741 సీట్లు, బయోటెక్నాలజీలో 154 సీట్లకు గాను 39 నిండాయి. సీటు పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కట్టాల్సి ఉంటే చలానా ద్వారా బ్యాంకులో చెల్లించాలి. ఆ రశీదులతో 27లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.
 
 29 నుంచి తుది కౌన్సెలింగ్: ఎంసెట్ బైపీసీ విభాగం అభ్యర్థులు ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. వచ్చే నెల ఒకటిన సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రకటనను ఈ నెల 25న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఎంపీసీ విభాగంలో మిగిలిపోయే సీట్లను తుది విడత బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు