పీహెచ్‌సీలకు సోలార్ విద్యుత్

2 Feb, 2015 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు సోలార్ విద్యు త్ సౌకర్యం కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 5 లక్షల చొప్పున 705 పీహెచ్‌సీలకు రూ. 35.25 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అనుమతి లభించిన వెంటనే వేసవిలోగా పనుల పూర్తికి అధికారులు సిద్ధమవుతున్నారు.  13వ ఆర్థిక సంఘం నిధులతో  ఏర్పాటైన 55 పీహెచ్‌సీల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
 
కరెంటు కోతలతో సమస్యలు...


గ్రామాల్లో కరెంటు కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతోన్నారు. జనరేటర్లు ఉన్నా పనిచేయడంలేదు. ఆపరేషన్ల సమ యంలో విద్యుత్ తప్పనిసరి. కరెంటు కోతతో రోగులను  పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు.
 
గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ ఘోరం. పెద్ద ఆసుపత్రులకు వెళ్లేందుకు కొండలు గుట్టలగుండా సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒక్కో పీహెచ్‌సీ కింద ఉండే  7 నుంచి 10 సబ్ సెంటర్లకు 4 వేల డోసుల వరకు వ్యాక్సిన్లను పీహెచ్‌సీల ఫ్రిజ్‌ల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన వ్యాక్సిన్లకు విద్యుత్ కోతలతో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి పీహెచ్‌సీలను గట్టెక్కించాలంటే సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయమని అధికారులు నిర్దారణకు వచ్చారు.

మరిన్ని వార్తలు