కుంచనపల్లిలో పందుల పోటీలు 

17 Jan, 2020 10:11 IST|Sakshi
కుంచనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పందుల పోటీ

తాడేపల్లిగూడెం రూరల్‌: సంక్రాంతి పేరు చెబితే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది కోడిపందేలు. అయితే, మండలంలోని కుంచనపల్లి గ్రామంలో మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా పందుల పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు సింగం పట్టాభి, సుబ్బారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు బుధవారం జరిగాయి. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పందుల పెంపకందారులు ఈ పోటీలకు తరలివచ్చారు.

కత్తులు కట్టకుండా ఎటువంటి జీవహింస లేకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సింగం సుబ్బారావు తెలిపారు. పోటీ నుంచి పారిపోయిన పంది పరాజయం పొందినదిగా భావించి బరిలో నిలబడిన పంది విజయం సాధించినట్లుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ఎటువంటి జీవహింస లేదని, తమపై వన్యప్రాణి సంరక్షణ సమితి వారు కేసులు నమోదు చేయడం సరికాదని వివరించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.  

మరిన్ని వార్తలు