చంద్రబాబుపై హైకోర్టులో పిల్‌..

26 May, 2020 14:29 IST|Sakshi

సాక్షి, అమరావతి‌ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి, న్యాయవాది పోనక జనార్ధన్‌రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు భారీ కాన్వాయ్‌తో ప్రయాణించిన చంద్రబాబు.. మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. 

రాజకీయ ర్యాలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాప్తి జరిగేలా చంద్రబాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాబుకు ఇచ్చిన అనుమతిని  రద్దుచేసి, ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, రెండు నెలల విరామం తర్వాత సోమవారం ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. లాక్‌డౌన్‌ను తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లి లోని తమ నివాసానికి చేరుకున్నారు. అయితే మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేశారు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా హడావుడి చేయడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినా టీడీపీ కేడర్‌ లెక్కచేయలేదు. చంద్రబాబు కూడా కార్యకర్తల్ని వారించే ప్రయత్నం చేయలేదు.(చదవండి : లాక్‌డౌన్‌ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్‌)

మరిన్ని వార్తలు