సాక్షి, హైదరాబాద్: విపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబుపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్సార్ సీపీ గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించిన వారు ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు.
పశ్చిమ గోదావరి జిల్లా విద్యానగర్కు చెందిన వీర్ల సతీష్కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఫిరాయించి మంత్రి పదవులు పొందిన ఎన్.అమర్నాథ్ రెడ్డి, వెంకట సుజయకృష్ణ రంగారావు, సి.ఆదినారాయణరెడ్డి, బి.అఖిలప్రియతో పాటు ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.