పల్నాటి ‘రాములమ్మ’

2 Apr, 2019 11:30 IST|Sakshi

సాక్షి, కారంపూడి : అది పల్నాడు పోరుగడ్డ.. అందులోన ఎన్నికల సంగ్రామం.. గ్రామాల్లో జోరుగా ప్రచారం.. సెగలుపుట్టిస్తున్న సూర్యుడిని లెక్కచేయక.. శ్వేదాన్ని చిందిస్తూ.. కుమారుడి విజయం కోసం అలుపెరుగక.. పరితపిస్తూ.. ప్రతిధ్వనిస్తూ.. ప్రచార పర్వంలో దూసుపోతున్నారు మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తల్లి రాములమ్మ.పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండ వేడిమికి తట్టుకోలేక చెట్ల కింద కూలబడుతుంటే.. ఆరుపదుల వయస్సు దాటిన రాములమ్మ లక్ష్యం, వేగం ముందు కాలం నివ్వెరబోతుంది.

సమయాన్ని వృథా  చేయకుండా ఇంటింటి ప్రచారంలో రాములమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గ్రామాల్లో వెల్లువెత్తుతున్న జనాదరణను చూసి పడుతున్న శ్రమను సైతం మరిచిపోతున్నారు. మరోవైపు పేటసన్నెగండ్లలో ప్రచారానికి ఆటంకం కలిగించాలని చూసిన వారిపై పల్నాటి నాగమ్మలా గర్జించారు. ఆమెకు తోడుగా కుమార్తె నాగమణి కూడా అన్న గెలుపు కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.నాలుగు రోజుల్లో మండలంలోని 11 గ్రామాలను చుట్టి వచ్చారు. వాస్తవంగా ఇంత తక్కువ కాలంలో నిజంగా ఏ ఒక్క అభ్యర్థి తరుఫు బంధువులు ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో ఎంతో కాలంగా  టీడీపీకి కంచుకోటగా భావించే మండలంలో కోటకు బీటలు వారుతున్నాయి. 

మరిన్ని వార్తలు