అధ్యాపక పోస్టుల భర్తీకి సన్నాహాలు !

7 Mar, 2014 03:11 IST|Sakshi

 యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్:
 ఎన్నికల కోడ్ ఉన్నా ఎస్వీయూలో మాత్రం అధ్యాపక పోస్టుల భర్తీకి అధికారుల ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇదంతా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం చేస్తున్న ప్రక్రియేనని విమర్శలు వస్తున్నారుు. ఎస్వీయూలో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎలాంటి పోస్టులు భర్తీచేయరాదు. ఖాళీల భర్తీకోసం ముందుగా ప్రయత్నం మొదలైనప్పటికీ, ప్రక్రియ ఎక్కడికక్కడే ఆపాల్సి ఉంది. తాత్కాలిక నియామకాలు కూడా చేయకూడదని ఎన్నికల నియామవళి చెబుతోంది. ఎన్నికల నిబంధనలు కఠినంగా ఉన్న నేపథ్యంలో ఎస్వీయూ అధ్యాపక పోస్టుల భర్తీ జరిగేది అనుమానమే. అయితే ఎస్వీయూ అధికారులు మాత్రం పోస్టులభర్తీకి ఈ నెల 26 నుంచి ఇంటర్వ్యూలు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
 
 ఇంటర్వ్యూల ద్వారా కిరణ్‌కు రాజకీయలబ్ధి
 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు యూనివర్సిటీ వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత వీసీ రాజే ంద్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశీస్సులతో నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అధ్యాపక నియామక ప్రక్రియలో ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గానికి ఉద్యోగాలు కట్టబెట్టే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకానీ, ఆయన నూతనంగా పెట్టబోయే రాజకీయ పార్టీకి కాని రాజకీయలబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెడితే కూడా, ఇంట ర్వ్యూల్లో ఎవరిని ఉద్యోగాలకు ఎంపిక చేశారో తెలుసుకోవడం పెద్దకష్టం కాదు. ఫలితంగా ఏదోఒక పార్టీకి రాజకీయ లబ్ధి జరిగే ప్రమాదం ఉంది.
 
 26 నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ
 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భ ర్తీకి ఈనెల 26 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఎస్వీయూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఇంజినీరింగ్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు జరిపి తర్వాత సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. దీనికోసం పరిపాలనా విభాగం మొత్తం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. పోస్టులు భర్తీ చేయాలన్న తాపత్రయంలో అధికారులు మిగతా అంశాలకు ప్రాధాన్యం తగ్గించి వీటిపైనే దృష్టిసారించారు.
 
 ఐదు జిల్లాలపై ప్రభావం
 ఎస్వీయూ రీజియన్‌లో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్వీ యూనివర్సిటీలో 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరిగితే ఐదు జిల్లాలపై రాజకీయప్రభావం ఉంటుందని విద్యార్థిసంఘాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలు ముగిసేవరకు ఇంటర్వ్యూల ప్రక్రియ నిలిపివేసి, అనంతరం నిర్వహించాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు.  
 
 ఎన్నికలు ముగిసేవరకు ఆపాలి
 మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎస్వీయూలో అధ్యాపక పోస్టులభర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించరాదు. ఇప్పటికే ఎస్వీయూ అధ్యాపక పోస్టులు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పోస్టుల భర్తీకి ఇప్పుడు ఇంటర్వ్యూలు జరిపితే కిరణ్ వర్గీయులకే దక్కుతాయి. అందువల్ల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే పార్టీకి రాజకీయంగా మేలు చేకూరుతుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు పోస్టుల భర్తీ నిలిపివేయాలి.
 - వి.హరిప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ కన్వీనర్, వైస్సార్ సీపీ విద్యార్థి విభాగం
 

మరిన్ని వార్తలు