కరోనా: హాట్‌స్పాట్‌గా కృష్ణలంక

7 May, 2020 07:52 IST|Sakshi
కేసులు ఎక్కువగా నమోదవుతున్న కృష్ణలంక ప్రాంతం 

సాక్షి, అమరావతి: విజయవాడలోని కృష్ణలంక.. అక్కడి వీధులన్నీ మూడు మీటర్ల నుంచి ఐదు మీటర్ల వెడల్పున్నవే. ఆ వీధుల్లోనే ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్‌ కూడా. పైగా జనసాంద్రత ఎక్కువే. ఇరుకిరుకు వీధుల్లోనే అవసరం లేకపోయినా రాకపోకలు. ఇక అక్కడ భౌతిక దూరం కేవలం మాటలకే పరిమితం కాగా.. అదే ప్రాంతంలోని జనం గుంపులు, గుంపులుగా చేరి‘పేకాట’, ‘హౌసీ’ వంటి సరదా ఆటలు.. ఫలితం జిల్లాలోనే అతి ఎక్కువ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన హాట్‌స్పాట్‌గా కృష్ణలంక నిలిచింది.  

ఓ లారీ డ్రైవర్‌ నుంచి.. 

  • ఇటీవల కోల్‌కతా నుంచి కృష్ణలంకలో గుర్రాల రాఘవయ్య వీధిలోని తన ఇంటికి చేరుకున్న ఓ లారీ డ్రైవర్‌ వచ్చి రావడంతోనే.. ఆయా ఆటల్లో చురుకుగా పాల్గొనడం వల్లే అతడి ద్వారా వైరస్‌ విస్తరణ జరిగిందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.  
  • అలా ఒకరి నుంచి మరొకరి ఆ వైరస్‌ సోకి.. ఇప్పుడు నగరంలోనే కృష్ణలంక హాట్‌స్పాట్‌గా మారింది.  
  • మొత్తం 95 మంది వరకు ఒక్క ఆ ప్రాంతంలోనే కరోనా వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  
  • నేటికీ కరోనా బాధితుల సంఖ్య అక్కడ పెరుగుతూనే ఉండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.  

కృష్ణ.. కృష్ణా.. 
3.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో కృష్ణలంక విస్తరించి ఉంది. ఇంత తక్కువ విస్తీర్ణం గల స్థలంలో ఎక్కువ ఇళ్లు ఉండటం.. 80వేల జనాభా ఉండటం కారణంగా వైరస్‌ నియంత్రణ సాధ్యం కావడం లేదు. కృష్ణలంకతోపాటు బృందావన కాలనీ, బ్యాంక్‌ కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, ప్రగతినగర్, రాణిగారితోట, రణదీర్‌నగర్, గుమ్మడివారి వీధి, బాల భాస్కర్‌ నగర్, చండ్రరాజేశ్వర నగర్, ఫక్కీరుగూడెం, ఇజ్రాయేల్‌ పేట, గుర్రాల రాఘవయ్య వీధి తదితర ప్రాంతాలన్నీ పక్కపక్కనే ఉన్నాయి. నగరంలో ఇలాంటి ఇరుకిరుకు ప్రాంతాలు సుమారు 20కిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు