ఆస్తి కాజేసేందుకు కుట్ర

4 Feb, 2018 10:28 IST|Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): హామీగా చేసిన రిజిస్ట్రేషన్‌ రద్దు చేయకుండా అన్యాయంగా తమ ఆస్తిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అశోక్‌నగర్‌కు చెందిన ఆశాలత మీడియా ఎదుట వాపోయింది. తమ కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించినా...అప్పు తీరలేదని హామీగా చేసిన రిజస్ట్రేషన్‌ రద్దు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చి తమపై దాడికి యత్నించారని వాపోయింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబ అవసరాల కోసం భర్త హరికృష్ణతో కలిసి 2016లో నాగమణి, రామకృష్ణల దగ్గర కొంత నగదు అప్పుగా తీసుకున్నానని చెప్పారు. అప్పు తీర్చడం కోసం ఆస్తిని అడుసుమిల్లి మోహనరామదాసుకు వారిద్దరు రిజిస్ట్రేషన్‌ చేయించారని పేర్కొన్నారు.

 హామీ పెట్టాలని పటమటలోని 400 చ.గల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. హామీగా మాత్రమే స్థలం రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని, అప్పుతీర్చినవెంటనే రద్దు చేస్తామని నమ్మబలికారని కన్నీటి పర్యంతమయ్యారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత రూ.10 ఆపైన వడ్డీ లెక్కగట్టి కోట్ల రూపాయల విలువచేసే తమ ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నారన్నారు. లక్షల రూపాయలు చెల్లించినా వడ్డీకే చాలలేదంటూ ఒత్తిడికి గురిచేశారన్నారు. మరోచోట ఉన్న 200 చ.గల స్థలాన్ని రిజిస్రేషన్‌ చేయించుకున్నారన్నారు.

నా భర్తను బెదిరించి అశోక్‌నగర్‌లో ఉన్న 195 గజాల ఇంటిని తనఖా చేయించుకున్నారని వాపోయింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేసిన స్థలాలు, ఇల్లు ఖాళీచేయాలంటూ రామదాసు కుమారుడు నందు, రామకృష్ణ, నాగమణి దౌర్జన్యం చేస్తున్నారన్నారు. శనివారం ఉదయం స్థలం వద్దకు వచ్చి గేటు తాళం పగులగొట్టారని, ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని తెలిపింది. భయపడి కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ చేయడంతో పటమట పోలీసులు వచ్చి కాపాడారని తెలిపింది. వారినుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకుంది.

మరిన్ని వార్తలు