నిమోనియా.. ప్రాణాలు తీసేనయా!

22 Oct, 2018 12:02 IST|Sakshi

అధికమవుతున్న కేసులు

గాల్లో కలసిపోతున్న చిన్నారుల ప్రాణాలు

అప్రమత్తతే శరణ్యమంటున్న వైద్య నిపుణులు

ఈ ఫొటోలో చిన్నారితో కలిసి ఉన్న ఈమె పేరు లక్ష్మి. రూరల్‌ పరిధిలోని వికలాంగుల కొట్టాల్లో నివాసముంటోంది.  చిన్నారికి కొన్ని రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం  వస్తుండడంతో సర్వజనాస్పత్రిలో చేర్పించింది. అలాగే మరో చిన్నారి పేరు అర్బన(5 నెలలు) శెట్టూరు మండలం బలపంపల్లి గ్రామం. నాలుగు రోజుల నుంచి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ఆస్పత్రిలో నిమోనియాతో బాధపడుతూ ఎంతో మంది చేరుతున్నారు.

అనంతపురం న్యూసిటీ: నిమోనియా వ్యాధి చిన్నారులను ప్రాణాలను కబలిస్తోంది. సీజినల్‌ వ్యాధుల్లో జ్వరపీడితులకు దీటుగా నిమోనియా బాధితులు పెరిగిపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా చిన్నారులు దీని బారిపడి మృత్యువాత పడుతున్నారు. అప్రమత్తతే శరణ్యమని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటుని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు అనుభవజ్ఞులైన చిన్నపిల్లల వైద్యులతోనే  వైద్యం ఇప్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు దగ్గు, జలుబు వస్తే చిన్నపాటి సూది మందు వేసుకుని పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.

పెరుగుతున్న మరణాలు
చిన్నారులు నిమోనియాతో బాధపడుతూ మృత్యువాతపడుతున్నారు. ఈ నెల 12న కళ్యాణదుర్గానికి చెందిన లక్ష్మి(2) నిమోనియాతో బాధపడుతూ సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డులో మృతి చెందింది. ఈ నెల 13న కుందుర్పికు చెందిన బేబీ ఆఫ్‌ బొమ్మక్క(2 నెలలు) సివియర్‌ నిమోనియాతో మృతి చెందింది. అలాగే ఈ నెల 14న ఉరవకొండ చిన్నకౌకుంట్లకు మధు(3నెలలు) నిమోనియాతో మృతి చెందాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు.  

కిక్కిరిస్తున్న సర్వజనాస్పత్రి
సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లలో వార్డులో గత మూడు నెలల్లో 50కిపైగా నిమోనియా కేసులు నమోదయ్యాయంటే వ్యాధి తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లల వార్డులో 60 పడకల సామర్థ్యం ఉంటే అందులో వందకుపైగా కేసులున్నాయి. దీంతో వార్డు కిక్కిరిసిపోతోంది.

వ్యాధి లక్షణాలు
నిమోనియా అనేది బ్యాక్టీరియల్‌ వైరస్‌. పెద్దల్లో దగ్గు, జలుబు ఉంటే పిల్లలకు త్వరగా అంటుకుంటుంది. చిన్నారుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరితగతిన దగ్గు, జలుబు, తీవ్ర జ్వరం, పిల్లికూతలు, కడుపు ఎగిరేస్తూ ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. టీకాలు సరిగా వేయించని, బరువు తక్కువ పిల్లలకు, నెలలు నిండని పిల్లలకు నిమోనియా వచ్చే అవకాశాలున్నాయి.

ఏం చేయాలి?
ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తే తక్షణం వైద్యున్ని సంప్రదించాలి.
ఇంట్లో ఎవరికైనా పెద్దలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే వారి వద్దకు పిల్లలను పంపరాదు. వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
పసివయసులో తల్లిపాలతో పాటు టీకాలు తప్పక వేయించాలి. ప్రైవేట్‌గా నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ లభిస్తుంది.  ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఇంత వరకు ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టడం లేదు.
అర్చన(బలపంపల్లి, శెట్టూరు)

మరిన్ని వార్తలు