జాషువా రచనలతో చైతన్యం

26 Oct, 2013 07:41 IST|Sakshi

 

=ఆత్మ సంఘర్షణ, అవమానాల నుంచే కవిత్వం
 =జాతీయ సదస్సులో కేయూ వీసీ వెంకటరత్నం

 
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : నాలుగు దశాబ్దాల తర్వాత కూడా గుర్రం జాషు వా రచనలు, సాహిత్యం నేటి సమాజంలో సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నాయని కాకతీయ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘గుర్రం జాషువా సాహిత్యతత్వం-సమకాలిన దృక్ప థం’ అంశంపై శుక్రవారం జాతీయ సదస్సు ఏర్పాటుచేశారు. హ్యుమానిటీస్ భవనంలోని సెమినార్ హాలులో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

ఆత్మ సంఘర్షణ, అవమానాల నుంచే జాషువా కవిత్వం పుట్టిందని పేర్కొన్నారు. తన జీవన యానంలో ఎన్నో అవమానాలు భరించిన జాషువా ఆ పరిస్థితి మరెవరికీ రాకూడదనే భావనతో సమాజంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన రచనలు చేశారని తెలిపారు. తన పాఠశాల రోజుల్లోనే జాషువా రాసిన గబ్బిలం కావ్యాన్ని చదివానని గుర్తుచేసుకున్నారు. కాగా, తెలుగు అకాడమీ ప్రాంతీయ కార్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటుచేయాలని భావిస్తే క్యాంపస్‌లో స్థలమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వీసీ తెలిపారు.
 
తెలుగు అకాడమీలో పరిశోధన కేంద్రం

 హైదరాబాద్‌లోని తెలుగు అకాడమీలో మూడేళ్ల క్రితమే జాషువా పరిశోధన కేంద్రం ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర తెలుగు అకాడమీ డెరైక్టర్ కె.యాదగిరి తెలిపారు. అలా గే, గుర్రం జాషువా జయంతి, వర్ధంతి సందర్భంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతో పా టు పాఠశాలల పిల్లల కోసం కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇంకా ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీరంగంలో కృషి చేసినవారికి ఏటా రూ.10లక్షల ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని వివరించారు. కా గా,  తెలుగు అకాడమీ ప్రాంతీయ కేంద్రం వరంగల్‌లో ఏర్పాటుచేసేందుకు రూ.2కోట్లు మంజూరయ్యాయని యాదగిరి పేర్కొన్నారు.

కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ కాళిదాసు మేఘాల ద్వారా సందేశాన్ని పంపితే, జాషువా గబ్బిలం కావ్యంలో అస్పృశ్యుడి ఆవేదనను ఆవిష్కరించడం దళిత చైతన్యంలో భాగమేనని తెలిపారు. తెలుగు విభాగం ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే కీలకపోన్యాసం చేస్తూ జాషువా సాహిత్యం అట్టడుగు వర్గాల జీవితాన్ని చిత్రించిందని తెలిపారు. తెలుగు కవులు తమ గ్రంథాలను పురుషులకే అంకితమిస్తే మొదటిసారిగా జాషువా తన గ్రంథాలను స్త్రీలకు అంకితమివ్వడం విశేషమన్నారు.

డాక్టర్ వేలూరి శ్రీదేవి మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడాలని జాషువా తన రచనలో ద్వారా తెలిపారన్నారు. సదస్సుకు కేయూ తెలుగు విభాగాధిపతి, సెమినార్ డెరైక్టర్ డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, హైదరాబాద్‌లోని జాషువా పరిశోధనా కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.శ్రీనివాసశర్మ పరిశోధనా కేంద్రం నివేదిక సమర్పించారు. సదస్సులో తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, ఆర్ట్స్ కాలేజీ తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏటూరి జ్యోతి, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్, ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, ననుమా స్వామితో పాటు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 పరిశోధన పత్రాల సమర్పణ

 కేయూలో జరిగిన జాతీయ సదస్సులో తొలిరోజు పలువురు పరిశోధనా పత్రాలు సమర్పించారు. జాషువా - క్రీస్తు చరిత్ర అంశంపై ప్రొఫెసర్ కె.ఆనందన్, జాషువా కవిత్వం అలంకారాలు  అంశంపై ప్రొఫెసర్ మానస చెన్నప్ప, జాషువా జీవితం సాహిత్య దృక్పథం అంశం పై డాక్టర్ విస్తాళి శంకర్‌రావు, జాషువా కవిత్వం చంద ప్రయోగాలు అంశంపై డాక్టర్ నర్సయ్య, జాషువా కవి త్వం ఆధ్యాత్మికత అంశంపై ప్రొఫెసర్ యోగా ప్రభావతి తదితరులు పరిశోధనా పత్రాలు సమర్పించారు.
 

మరిన్ని వార్తలు