పోలీసుల అదుపులో అవినాష్ అనుచరులు

13 Mar, 2015 11:44 IST|Sakshi

విజయవాడ:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినాష్ అనుచరులు రామకృష్ణ, వేణుగోపాల్లను కాకినాడ పోలీసులు శుక్రవారం కృష్ణాజిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద అరెస్ట్ చేశారు. కాగా అవినాష్ నిన్న డీజీపీ జేవీ రాములు ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో వీరిద్దరూ హైదరాబాద్ పరారవుతున్నట్లు సమాచారంతో కాకినాడ పోలీసులు వారిని చేజ్ చేసి పట్టుకున్నారు.

అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అవినాష్ అనుచరులను మీడియా కంట పడకుండా చిల్లకల్లు నుంచి కాకినాడకు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు లొంగిపోయిన అవినాష్ను నార్త్ కోస్టల్ ఐజీ అతుల్ సింగ్ ప్రత్యేక ఎస్కార్ట్‌తో తూర్పు గోదావరి జిల్లాకు పంపించారు.

మరిన్ని వార్తలు