గుట్కా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడి

7 Feb, 2019 07:48 IST|Sakshi
ఉండి ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో గుట్కా వివరాలు సేకరిస్తున్న సీఐ చంద్రశేఖరరావు

రూ.15 లక్షల విలువైన సరుకు స్వాధీనం

పోలీసుల అదుపులో నిందితులు

భీమవరం టౌన్, ఉండి : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలో  నిషేదిత గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం ఉదయం భీమవరం వన్‌టౌన్‌ సీఐ పి.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఎంసీ బ్రాండ్‌ పేరుతో ముద్రించిన రేపర్స్‌లో  గుట్కాను ప్యాక్‌ చేసి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలలకు  సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 15 లక్షలు విలువైన 60 బస్తాల సరుకు, రెండు గుట్కా తయారీ యంత్రాలు, 20 పెట్టెల్లోని 8 లక్షల ఎంసీ బ్రాండ్‌ రేపర్స్, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.  ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సీఐ పి.చంద్రశేఖరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్పెషల్‌ బ్రాంచి ఇచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ ఎం. రవిప్రకాష్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాత్రి గస్తీలో ఉన్న భీమవరం వన్‌టౌన్‌ ఎస్సై డి.హరికృష్ణ, కానిస్టేబుల్‌ డి.బాలసురేష్‌కుమార్‌ అప్రమత్తమయ్యారు. 

రాజమహేంద్రవరానికి గుట్కా బస్తాలను తరలిస్తున్న ఆటోను భీమవరం » స్టాండ్‌ సెంటర్‌లో పట్టుకున్నారు. తణుకు ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ కేరు అప్పన్నను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో  పోలీ సులు  ఎన్‌ఆర్‌పీ అగ్రహారంలోని  శివాలయం సమీపంలో ఉన్న ఒక షెడ్డు వద్దకు చేరుకోవడంతో గుట్కా గుట్టు రట్టయింది. ఈ కేంద్రాన్ని  రహస్యంగా నడుపుతున్న  ఉండి ప్రాంతానికి చెందిన కెల్లా రామారావును అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కూడా వీరవాసరంలో  గుట్కా రవాణా చేస్తూ పట్టుబడడంతో కేసు నమోదైంది. పట్టుబడిన సరుకు, యంత్రాలతో పాటు నిందితులను భీమవరం వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.  ఇక్కడ కేవలం పొ గాకు, పాన్‌ మసాలా తయారీకి మాత్రమే అనుమ తి ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకును దిగుమతి చేసుకుని వాటితో గుట్కాను తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.  ఇక్కడ గు ట్కాను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరికి సరఫరా చేస్తున్నారో పో లీసులు విచారణ చేస్తున్నారు.  ఈ దాడిలో భీమవరం రూరల్‌ సీఐ సునీల్‌కుమార్, ఉండి పోలీసులతో పాటు ప్రత్యేక సిబ్బంది కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు