గుట్టుచప్పుడు కాకుండా తప్పించారు

7 Jul, 2020 11:57 IST|Sakshi

 లెనిన్‌ నగర్‌లో ఓ కానిస్టేబుల్‌ పేకాట నిర్వహణ  

పట్టుబడినా పట్టించుకోని పోలీసులు

అనంతపురం క్రైం: జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో కొందరు పోలీసులు అక్రమార్కులకు అండగా నిలిస్తున్నారు. తప్పు సొంతవారు చేస్తే వదిలేయడం..సామాన్యులు చేస్తే రూల్స్‌ మాట్లాడడం పరిపాటిగా మారింది. ఇటీవల వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పేకాట నిర్వహిస్తూ పట్టుబడిన ఓ కానిస్టేబుల్‌కు వన్‌టౌన్‌ పోలీసులు అండగా నిలిచారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ సత్యయేసు బాబు దీనిపై విచారణ చేపడితే అసలు బాగోతం వెలుగు చూస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి.  (పోలీస్‌ స్టేషన్‌లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు)

ఇదీ సంగతి: గత నెలలో వన్‌టౌన్‌ పరిధిలోని లెనిన్‌నగర్‌లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ఓ ఎస్‌ఐ నేతృత్వంలో పేకాట నిర్వహిస్తున్న ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఆరుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట నిర్వహిస్తున్న వ్యక్తి ఓ కానిస్టేబుల్‌ అని తెలిసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా కానిస్టేబుల్‌ను తప్పించేశారు. కేవలం ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఎస్‌ఐ అండదండలతోనే కానిస్టేబుల్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు