ఛత్తీస్‌ఘడ్‌కే.. ఆర్కే!

10 Oct, 2018 07:34 IST|Sakshi

గత రెండేళ్లుగా తెరవెనుక నుంచే కీలకపాత్ర

తాజా ఘటనల్లో ఆయన పాల్గొన్నారని పోలీసుల ప్రకటన

మల్కన్‌గిరి మీదుగా సేఫ్‌ జోన్‌కు చేరుకున్నారని అనుమానం

ఏవోబీని జల్లెడ పడుతున్న ఏపీ, ఒడిశా బలగాలు

ఆర్కే సహా కీలక నేతలే టార్గెట్‌గా కూంబింగ్‌

ఆయన మోస్ట్‌ వాంటెండ్‌ మావోయిస్టు.. రెండేళ్ల క్రితం రామగుడ ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆయన ఆచూకీపై ఆందోళన వ్యక్తమైంది.. పోలీసులపై అనుమానాలు వెల్లువెత్తాయి.. చివరికి ఆయన సేఫ్‌ జోన్‌లో సురక్షితంగా ఉన్నారని స్పష్టమైంది.గత నెలలో జరిగిన లివిటిపుట్టు హత్యాకాండ.. తదనంతరం ఏవోబీ కటాఫ్‌ ఏరియాలో మావోల భారీ బహిరంగ సభ, తాజాగా ఒడిశాలోని పొట్టంగి సమీప అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ తదితర వరుస ఘటనలు మళ్లీ ఆ మోస్ట్‌ వాంటెడ్‌ ఉనికిపై చర్చకు తెరలేపాయి. అతనే మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే..రామగుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత రెండేళ్లు సేఫ్‌జోన్‌లో స్తబ్దుగా ఉన్నట్లు కనిపించిన ఆర్కే.. వాస్తవానికి చాప కింద నీరులా దెబ్బతిన్న మావోయిస్టు క్యాడర్‌ను పునరుజ్జీవింపజేశారని అంటున్నారు. దాని ఫలితమే గత 20 రోజుల్లో జరిగిన దారుణాలు..తెరవెనుక వ్యూహాలు రచిస్తూ.. క్యాడర్‌ను ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి బహిరంగ సభ, పొట్టంగి ఎన్‌కౌంటర్‌ స్థలంలో ఆయన ఉన్నారని పోలీసులు ప్రకటిస్తున్నారు. కాల్పుల నుంచి తప్పించుకున్న ఆర్కే సహా కీలక నేతలు తిరిగి ఛత్తీస్‌ఘడ్‌లోకి వెళ్లిపోయారని అంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) సహా కీలక నేతలే టార్గెట్‌గా ఏపీ, ఒడిశా పోలీసులు ఏవోబీలో జల్లెడపడుతున్నారు. రెండేళ్ల కితం రామ్‌గూడ ఘటనలో ఆర్కే లక్ష్యంగానే పోలీసులు దాడులు చేయగా.. సరిగ్గా ఇప్పుడు కూడా ఆయనే టార్గెట్‌గా ఖాకీలు వేట మొదలుపెట్టారు.

వాస్తవానికి రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆర్కే ఆచూకీపై అనుమానాలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో ఆయన కుమారుడు మున్నా సహా 32 మంది మావోయిస్టులను పోలీసులు కాల్చి చం పారు. ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయంపై చాలా కాలం సందిగ్ధత నెలకొంది. అప్పట్లో భార్యతో సహా కుటుంబసభ్యులు ఆర్కే ఆచూకీని పోలీసులు బయటపెట్టాలంటూ హైకో ర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆర్కే క్షేమంగా సేఫ్‌జోన్‌లో ఉన్నారంటూ కుటుం బసభ్యులు, మావోలు ప్రకటించినా... జాడ మాత్రం తెలియరాలేదు. ఏవోబీ దాటి ఛత్తీస్‌గఢ్‌లో ఆయన తలదాచుకున్నారేమోనన్న వాదనలు అప్పట్లో తెరపైకి వచ్చాయి. పోలీసులు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.
గత నెల 23వ తేదీన ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను డుంబ్రిగూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మహిళా మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపడం, ఆ తర్వాత  ఏవోబీలోని కటాఫ్‌ ఏరియాలో వేలాదిమందితో మావోలు బహిరంగసభ నిర్వహించడం, తాజాగా ఆదివారం కోరా పుట్‌ జిల్లా సుంకి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం కావడం.. తదితర పరిణామాలన్నీ పోలీసులకు షాక్‌ మీద షాక్‌ ఇస్తున్నాయి.

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆదేశాలతోనే మావోలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, స్వయంగా ఆయన ఏవోబీలోనే మకాం వేసి ఉద్యమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని పోలీసు అధికారులు నిర్థారణకు వచ్చారు. సుంకి సమీపంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే ఉన్నట్టు అనుమానిస్తున్నామని అక్కడ ఎస్పీ వెల్లడించగా, ఏవోబీలోనే మకాం వేసిన ఆర్కే, ఇతర కీలక నేతలే టార్గెట్‌గా మన పోలీసులు జల్లెడ పడుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి వెల్లడించారు.

వ్యూహరచనలకే ఆర్కే పరిమితం?
ఏవోబీతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో నిదండకారుణ్య ప్రాంతంలో ఆర్కే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మావోల హింసాత్మక సంఘటనలకు వ్యూహ రచన బాధ్యతలు నిర్వహించ డం మినహా నేరుగా ఆపరేషన్లలో ఆయన పాల్గొనడం లేదని సమాచారం. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌లో తన కుమారుడు మున్నా, ఆయన గన్‌మెన్‌లు సహా 32 మంది మావోలను పోగొట్టుకున్న తర్వాత ఏవోబీలో మావోయిస్టుల ఉద్యమ బాధ్యతను తనపై వేసుకున్న ఆర్కే రెండేళ్లలోనే భారీ రిక్రూట్‌మెంట్‌తో పార్టీకి పునరుత్తేజం తీసుకువచ్చిన ట్టు చెబుతున్నారు.మావోల ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో అనునిత్యం శ్రమిస్తున్న ఆర్కే నేరుగా మావోయిస్టుల దళాలు, ఏరియా కమిటీలతో కలిసి తిరగడం లేదని అంటున్నారు. ఏవో బీలోనే సురక్షిత ప్రాంతంలో తలదాచుకుని వ్యూ హాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలుస్తోంది. గత ఆగస్టు నెలలో కటాఫ్‌ ఏరియాలో జరిగినఅమరవీరుల వారోత్సవాల్లో పాల్గొన్నారని, ఆయన ఆదేశాలతోనే చలపతి, అరుణ ల ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తోందని అంటున్నారు.

ఛత్తీస్‌ఘఢ్‌ వైపు ఆర్కే
ఆదివారం కోరాపుట్‌ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆర్కే సహా మావోయిస్టు నేతలు త్రుటిలో తప్పిం చుకున్నారని భావిస్తున్న పోలీసులు ఇప్పుడు వారు ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఏవోబీ నుంచి  ఛత్తీస్‌గఢ్‌కు మల్కన్‌గిరి మీదుగా వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఒడిశా కటాఫ్‌ ఏరియాలో కూంబింగ్‌ను ఉధృతం చేశారు. గ్రేహౌండ్స్‌ బలగాలతోపాటు ఒడిశా వైపు నుంచి బీఎస్‌ఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ను చేపట్టాయి.

డిసెంబర్‌ వరకుమావోయిస్టులకు అనుకూలం
తూర్పుకనుమల్లో భాగంగా ఉన్న అటవీ ప్రాంతం డిసెంబర్‌ వరకు ఆకులు, తుప్పలతో దట్టంగా ఉంటుంది. దీంతో ఎంతమంది పోలీసులు కూంబింగ్‌ చేపట్టినా మావోయిస్టుల కదలికలను పసిగట్టడం అంత తేలిక కాదు. డిసెంబర్‌ తరువాత అడవిలో ఆకులు రాల్చే చెట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఆ కా>లం మావోయిస్టులకు ప్రతికూలంగా ఉంటుందని.. పోలీసులకు అనుకూలంగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు