ర్యాలీలకు అనుమతి నిరాకరణ

9 Jan, 2020 20:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ/గుంటూరు: రేపు (శుక్రవారం) ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు తలపెట్టిన మహిళల ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు తెలిపారు. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలుల్లో ఉన్నాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ర్యాలీలో ఎవరైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బందరు రోడ్డులో ర్యాలీకి అనుమతి లేదు..
అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రేపు (శుక్రవారం) బందరు రోడ్డులో చేపట్టనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. బెజవాడలో సెక్షన్‌ 144,  పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉన్నాయన్నారు. బందరు రోడ్డులో నిత్యం వైద్య,విద్య,వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. బందరు రోడ్డుకు ఆనుకుని ప్లైఓవర్‌ నిర్మాణ పనులు జరగడంతో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీస్‌ శాఖ సహకరిస్తుందని తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు అనుమతి ఉండదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు