ఏవోబీలో అలర్ట్‌

30 May, 2020 07:44 IST|Sakshi

మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ 

కదలికలపై పోలీసుల గురి 

పాడేరు: ఏవోబీలో మావోయిస్టు నేతలు, యాక్షన్‌ టీమ్‌ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా ప్రాంతానికి దగ్గరగా ఉన్న సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అరకు సంతబయలు ప్రాంతంలో మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ సభ్యులు వచ్చి రెక్కీ నిర్వహించినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో వారి కదలికలపై నిఘా పెంచారు. 

ఇదీ పరిస్థితి... 
లాక్‌డౌన్‌తో మావోయిస్టులు కూడా తమ కార్యకలపాలకు విరామం ప్రకటిస్తున్నట్టు గత నెలలోనే ప్రకటన చేశారు. పోలీసులు కూడా అడవుల్లో కూంబింగ్‌ నిలిపివేశారు. అయితే మావోయిస్టులు జనావాసాల్లో సంచరిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఏవోబీలో నిఘాను పెంచింది. ఇటీవల చింతపల్లి ఏఎస్పీ సతీష్‌కుమార్‌ మావోయిస్టు యాక్షన్‌ టీమ్‌ల సంచారంపై ప్రకటన చేశారు. మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు, యాక్షన్‌ టీమ్‌ సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసుశాఖ విడుదల చేసింది. వారి సమాచారం తెలిపిన వారికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని పేర్కొంది.  

మరిన్ని వార్తలు