దళిత యువకులపై పైశాచికం

4 Dec, 2016 01:19 IST|Sakshi

రెండు రోజులుగా లాకప్‌లో లాఠీలతో తీవ్రంగా కొట్టిన పోలీసులు
 
 చుండూరు(అమృతలూరు): కక్ష సాధింపు కోసం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారించకుండా దళిత మైనర్ బాలురను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు. రెండు రోజులుగా లాకప్‌లో లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో వారు నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. చుండూరులో ఇటీవల జనచైతన్య యాత్ర జరిగింది. ఆ సందర్భంగా కాలనీలో టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను కట్టారు. ఈ నెల ఒకటో తేదీన అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన కొందరు యువకులు రోడ్డు పక్కనున్న చెత్తతో చలిమంటలు వేసుకున్నారు.

ఆ చెత్తలో టీడీపీ జెండా ఉందన్న విషయం వారు గమనించలేదు. అరుుతే జెండాను మంటల్లో వేసి కాల్చుతున్నారని టీడీపీకి చెందిన కొందరు ప్రచారం చేశారు. దీంతో అదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అండదండలతో ఆ యువకులపై కేసు పెట్టాడు. దీంతో గురువారం అర్థరాత్రి  పోలీసులు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని వదిలి,మిగిలిన ఆరుగురిని లాకప్‌లో లాఠీలతో చితకబాదారు. సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఎస్‌ఐ విక్టర్ మైనర్లపై పైశాచికంగా వ్యవహరించాడంటూ బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.

 ఈ సంఘటనపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరు సర్కిల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.

మరిన్ని వార్తలు