కష్టం చెప్పుకోవాలని వస్తే.. గెంటేశారు!

8 May, 2018 02:54 IST|Sakshi
ఇంద్రపాలెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద విమల, ఐద్వా నాయకురాలు సుభాషిణి తదితరులు

‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’లో ఘటన

కాకినాడ రూరల్‌: ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో నిర్వహించిన ర్యాలీ సందర్భంగానే ఓ విద్యార్థినిపట్ల పోలీసులు నిర్దయగా వ్యవహరించిన ఘటన సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ప్రారంభమవుతుండగా.. తనను ఓ వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకొనేందుకు తూరంగికి చెందిన విద్యార్థిని విమల కలెక్టరేట్‌కు వచ్చింది.

ఈ నెల 4న ఇంద్రపాలెం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జేసీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను నిర్దయగా బయటకు గెంటేశారు. అక్కడే ఉన్న ఐద్వా నాయకురాలు కె.సుభాషిణి విషయం తెలుసుకుని, ఆ అమ్మాయి కష్టాన్ని అధికారులకు తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, ఇంద్రపాలెం స్టేషన్‌కు తరలించారు. ఒకపక్క ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. మరోపక్క తమకు న్యాయం చేయాలని కోరేందుకు వెళ్తుంటే నిర్బంధించడాన్ని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చివరకు వారి సమక్షంలోనే బాధిత విద్యార్థిని ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు