పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం

15 Sep, 2015 13:49 IST|Sakshi

గుంతకల్ టూటౌన్ పోలీసుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు... గుంతకల్ పట్టణంలోని గుత్తిరోడ్డులో మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో జాకీర్ హుస్సేన్ అనే యువకుడు మంగళవారం ఉదయం ఇంటి దగ్గర పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

జాకీర్ హుస్సేన్ వెల్డింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హుస్సేన్ తండ్రి జిలాన్‌పాషా మట్కా రాసే పని చేసేవాడు. పాషా రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అయితే, హుస్సేన్ కూడా మట్కా రాసే పని చేస్తున్నాడన్న అనుమానంతో టూటౌన్ పోలీసులు హుస్సేన్‌ను గత 15 రోజులుగా తీసుకెళ్లి విచారిస్తున్నారు.

రూ.85 వేలు కట్టాలని పోలీసులు డిమాండ్ చేశారని, కట్టలేననడంతో రోజూ విచారణ పేరుతో తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చి సాయంత్రం వదిలిపెడుతున్నారని హుస్సేన్ తల్లి మల్లికాబేగం తెలిపారు. పోలీసుల వేధింపులతో ఆందోళన చెందే హుస్సేన్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు