హిందూపురం: లేపాక్షి ఉత్సవాల పేరుతో అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో పోలీసుల ఆంక్షలు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏపీఆర్ఎస్ మైదానంలో లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం 5 గంటలకు హిందూపురం రావాల్సి ఉండగా, ఉదయం నుంచే పోలీసులు ఏపీఆర్ఎస్ మైదానానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అన్ని రకాల వాహనాలను నిలిపి వేస్తున్నారు.
నడిచి వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. చిన్న పిల్లలున్నా సరే వాహనాలను అనుమతించకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే, బాగేపల్లి తదితర ప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లేపాక్షి ఉత్సవాలకు ముందుగా శనివారం ఉదయం 10 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభం కాలేదు.