పోలీసులకు మానసిక ఒత్తిడి ఎక్కువే

8 Mar, 2014 00:57 IST|Sakshi
పోలీసులకు మానసిక ఒత్తిడి ఎక్కువే

మెడికల్ క్యాంప్ ప్రారంభ కార్యక్రమంలో డీజీపీ
 సాక్షి, హైదరాబాద్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడుతుంటారని రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు అన్నారు. వయసు ప్రభావంతో రక్తపోటు, మధుమేహం, గుండెనొప్పి బారిన పడకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు ఆయన సూచించారు. మెడ్విన్ ఆస్పత్రి సౌజన్యంతో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు వెల్ఫేర్ మెడికల్ క్యాంప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
 
  ఈ శిబిరంలో పంపిణీ చేసే మందులకోసం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రూ.లక్ష విరాళంగా ఇచ్చిందని డీజీపీ తెలిపారు. ఈ క్యాంప్ సేవల్ని డీజీపీ కార్యాలయంతోపాటు ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏపీఎస్పీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం వినియోగించుకోవచ్చని అదనపు డీజీ(సంక్షేమం) సౌమ్య మిశ్రా తెలిపారు.

మరిన్ని వార్తలు