గిద్దలూరులో చాలెంజ్‌ ఓటు

12 Apr, 2019 12:37 IST|Sakshi
చాలెంజ్‌ ఓటు వేసిన అనిత

తొలి ఓటునే చాలెంజ్‌ ఓటుగా వేసిన యువతి

సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా గిద్దలూరులో ఓ యువతి గురువారం చాలెంజ్‌ ఓటు వేసింది. పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన అనిత తన మొదటి ఓటునే చాలెంజ్‌ ఓటుగా వేయాల్సి వచ్చింది. స్థానిక యాదవ బజారులోని 202 పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు పొందిన అనిత.. ఓటు వేసేందుకు అక్కడికి వెళ్లింది. అప్పటికే ఆమె ఓటును గుర్తు తెలియని వారు వేయడంతో అనిత ఓటు వేసేందుకు పోలింగ్‌ అధికారులు నిరాకరించారు. అయితే, తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని అనిత గట్టిగా చెప్పడంతో పాటు మీడియా, సోషల్‌ మీడియా ద్వారా చాలెంజ్‌ ఓటు గురించి తెలుసుకుని ఉన్న ఆమె.. తనకు చాలెంజ్‌ ఓటు ఇవ్వాలని కోరింది. దీంతో పోలింగ్‌ అధికారి ఆమెకు చాలెంజ్‌ ఓటు ఇచ్చారు. చాలెంజ్‌ ఓటు వినియోగించుకున్న అనితను పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు