తెలంగాణలోనూ విజయమ్మకు అపూర్వ ఆదరణ

3 Jul, 2013 21:18 IST|Sakshi
హన్మకొండ సమావేశంలో విజయమ్మ

వరంగల్: తెలంగాణలో  కూడా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ పర్యటనకు అపూర్వ ప్రజాదరణ లభిస్తోంది. ఈ రోజు వరంగల్ జిల్లాలో ఆమె పర్యటించిన ప్రతి ప్రాంతానికి భారీగా జనం తరలి వచ్చారు. నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆమె వెళ్లే మార్గంలోని ప్రతి ప్రధాన కూడలిలో  స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.  కొండా దంపతులు మురళీ, సురేఖ విజయమ్మ వెంటే ఉన్నారు.

రఘునాథ్‌పల్లి మండలం కంచెనపల్లిలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విజయమ్మ ఆవిష్కరించారు. పూల మాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత వరంగల్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్‌లో జరిగిన పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సదస్సులో ఆమె ప్రసంగించారు.
 పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రతి పంచాయతీని మనం గెలవాలని దిశానిర్దేశం చేశారు.  పంచాయతీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని సూచించారు. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి  నీళ్లు దొరకడం లేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా తయారయి వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. విద్యుత్ కోతలతో పల్లెలు చీకట్లో మగ్గుతున్నాయని చెప్పారు. ప్రజల కష్టాల గురించి ఆలోచించకుండా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు. కరెంట్ బిల్లుల మోతతో పంచాయతీలు దెబ్బతిన్నాయని అన్నారు. వైఎస్సార్ తర్వాత ఏ నాయకులు కూడా సకాలంలో స్థానిక ఎన్నికలు జరిపించలేదని విజయమ్మ గుర్తు చేశారు.

 స్థానిక సంస్థలకు నిధులు, విధులు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికలను గడువులోగా జరపాలని కోర్టు ఆదేశించినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికలను కూడా కాలయాపన చేసిందని విమర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని విజయమ్మ భరోసా ఇచ్చారు. మనమంతా ఒకే కుటుంబ సభ్యులమని చెప్పారు. పార్టీ పరంగా స్థానికంగా సమస్యలేమైనా ఉంటే పైస్థాయి నాయకులతో మాట్లాడాలని సూచించారు. సమస్యలు పక్కనపెట్టి, జగన్, వైఎస్సార్ వైపు చూడాలన్నారు. మనకు ప్రజల మద్దతు ఉన్నప్పటికీ మితిమిరీన ఆత్మవిశ్వాసానికి పోవద్దని హెచ్చరించారు. ప్రతి పంచాయతీలో వైఎస్సార్ సీపీ పాగా వేయాల్సిన అవసరముందని చెప్పారు. వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని, క్యాడర్ ను తయారు చేసుకోవడానికిదే సమయమన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ పోరాటాలు చేయాలని సూచించారు.

కుమ్మక్కు కుట్రపై తీర్పు ప్రజా తీర్పు కోరుతున్నా

 డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ గ్రామంలో సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో  విజయమ్మ ప్రసంగించారు. ఈ సభకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు కుట్రలపై ప్రజల తీర్పుని కోరుతున్నానన్నారు.   పేద ప్రజల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మహిళలు ఎదగాలని పావలా వడ్డీ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఇప్పుడు అవన్నీ  మసకబారిపోయాయన్నారు. జగన్ బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత వైఎస్ పథకాలన్నింటినీ అమలు చేస్తారని చెప్పారు. ప్రతి పంచాయతీని గెలుచుకొని జగన్కు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. వైఎస్ పాలననాటి సువర్ణ యుగం మళ్లీ జగన్ బాబు తెస్తారని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు