నగదు బ్యాగ్‌తో గోదావరిలో ఈదుకుంటూ..

18 Jul, 2018 07:27 IST|Sakshi
తడిసిన నగదును ఆర బెడుతున్న పోస్టుమాస్టర్‌ నాగేశ్వరరావు

కూలీల సొమ్మును రక్షించిన పోస్టుమాస్టర్‌కు అభినందనలు

తూర్పుగోదావరి : /ముమ్మిడివరం: ఒక వైపు పడవ మునిగి గోదావరిలో కొట్టుకుపోతుంటే.. కూలీలకు చెందాల్సిన సొమ్మును భద్రంగా ఒడ్డుకు చేర్చి ఆ కూలీలకు అందజేసిన పోస్టుమాస్టర్‌ను గ్రామస్తులందరూ అభినందించారు. శేరులంక పోస్టుమాస్టర్‌ పోతుల నాగేశ్వరరావు శనివారం ఉపాధి కూలీలకు సంబంధించి రూ.3 లక్షలు ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం సబ్‌ పోస్టాఫీస్‌ నుంచి డ్రా చేశారు. ఆ సొమ్ముతో సైకిల్‌పై శేరులంకలో బయలుదేరి పశువుల్లంక రేవులో పడవ ఎక్కాడు. పడవ ప్రమాదానికి గురై సైకిల్‌పై పెట్టిన బ్యాగ్‌ గోదావరిలో పడిపోయాయి.

గోదావరిలో కొట్టుకుపోతున్న నగదు బ్యాగ్‌ను తోటి ప్రయాణికుడు కొండేపూడి గంగశాస్త్రి పట్టుకొని పోస్టుమాస్టర్‌కు అప్పగించారు. ఆ బ్యాగ్‌తో అతి కష్టంమీద ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరారు. తడిసి ముద్దయిన నోట్లను ఆరపెట్టి మంగళవారం కూలీలకు అందజేశారు. సైకిల్‌ గోదావరిలో కొట్టుకుపోయినా కూలీలకు దక్కాల్సిన సొమ్మును భద్రంగా తీసుకొచ్చి అందజేసిన ఆయన నిజాయితీని గ్రామస్తులు అభినందించారు.

>
మరిన్ని వార్తలు