పల్లెల్లో కరెంట్ కోతలకు రంగం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అవసరం తీరిందని భావిస్తున్న అధికారులు గ్రామాల్లో కోత పెట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇవి గురువారం నుంచి అమలుకానున్నాయి. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. ఇకనుంచి గ్రామాల్లో ఐదు గంటలపాటు కోత పడనుంది.
సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు వరకు సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కోతలను క్రమక్రమంగా పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. విజయవాడ, శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతికలోపంతో కోతలు అనివార్యమని అధికారులు చెపుతున్నా.. కొర్పొరేట్ సంస్థలకు విద్యుత్ కోటా పెంచడం కోసమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క వానలు, వరదలతో అల్లాడుతున్న గ్రామీణ ప్రాంత ప్రజలకు అధికారులు కరెంట్ కోతలు మరింత సమస్యగా మారనున్నాయి. పంచాయతీ పోరులో ఎన్నికైన కొత్త ప్రజాప్రతినిధులకు కరెంట్ కోతలు ప్రధాన సమస్యగా పలకరించనున్నాయి.