చౌదరి గన్‌ మెన్ల దౌర్జన్యం

13 May, 2019 09:52 IST|Sakshi
ప్రస్తుతం గన్‌మెన్లు నిర్మిస్తున్న ఇంటి వద్ద మాబున్ని

పేదల స్థలాలు ఆక్రమణ  

దిక్కున్న చోట చెప్పుకోండంటూ హూంకరింపు

న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు  

అనంతపురం రూరల్‌: అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి గన్‌మెన్లు దౌర్జన్యాలకు తెరలేపారు. పేదలకిచ్చిన స్థలాలను ఎమ్మెల్యే పేరు చెప్పి బలవంతంగా అక్రమించుకుంటున్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ హుకుం జారీ చేశారని ఎ.నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి చెందిన రామాంజినమ్మ, మాబున్నీలకు 2007లో ఇందిరమ్మ కాలనీలో ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్నారు. 70 శాతం మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయినా బిల్లులు రాలేదు. దీంతో ఇంటి నిర్మాణ పనులు ఆపేసి బాడుగ ఇంట్లో జీవసం సాగిస్తున్నారు. ఇదే అదునుగా భావివంచిన ఎమ్మెల్యే గన్‌మెన్లు హరి, నబిరసూల్‌లు ఖాళీగా ఉన్న ఆ రెండు ఇళ్లను తమ అధీనంలోకి తీసుకొని నేల మట్టం చేశారు. స్థలాలను ఆక్రమించి పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

ఇదెక్కడి న్యాయం?
ప్రభుత్వం తమకు మంజూరు చేసిన స్థలంలో మీరు ఎలా ఇంటి నిర్మాణ పనులు చేపడతారని ప్రశ్నిస్తే ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మీ పేర్ల మీద ఉన్న పట్టాలను రద్దు చేయించాం. మీకు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోండం’టూ దౌరజ్జన్యం చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యా రు.  పనులకు వెళ్లి పొట్ట నింపుకునే బడుగు జీవులపై పెత్తనం చెలాయించడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే గన్‌మెన్లు తమ పేర్ల పైన ఇంటి పట్టాలు ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని తెలిసి, వారి సమీప బంధుల పేరిట పట్టాలు పొందినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు