వంట వండి.. ఇస్త్రీ చేసి..!

3 Jun, 2014 01:01 IST|Sakshi

 కల్లూరు రూరల్, న్యూస్‌లైన్:  ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో భాగంగా సోమవారం కర్నూలు నగరం ఏపీఎస్‌పీ క్యాంప్‌లో ట్రేడ్‌మెన్ అభ్యర్థుల ఎంపికకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నిపుణతను పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా లేదా అనేది పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరవగా వీరికి జులై 27వ తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కల్నల్ జాఫ్రి తెలియజేశారు.

 సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మెన్, టెక్నికల్,నర్సింగ్,  క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అయితే ఈనెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ఇది ముగుస్తుందన్నారు.

>
మరిన్ని వార్తలు