ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే సంకల్పయాత్ర: గడికోట

5 Nov, 2017 16:40 IST|Sakshi

రాయచోటి(వైఎస్సార్‌ జిల్లా): రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికే తమ నాయకుడు ప్రజా సంకల్ప యాత్రను చేపట్టబోతున్నారని వైఎస్సార్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలోని పెద్ద దర్గాలో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు ప్రజల్లో ఎంత వరకు వ్యతిరేకత ఉందో అందరికి తెలుస్తుందన్నారు. మూడు సంవత్సరాలుగా రాజధాని నిర్మాణం కేవలం గ్రాఫిక్స్ లకే పరిమితం అయిపోయిందని విమర్శించారు. కేవలం గ్రాఫిక్స్ కటౌట్లతో, విదేశీ పర్యటనలకే పాలన సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలలో టీడీపీ ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో సోమవారం నుంచి అందరం  చూడబోతున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు