సాక్షి, నెల్లూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు.
అక్కడి నుంచి ముందుగా గోగినేని పురానికి పాదయాత్ర చేరుకుంటుంది. అటుపై చెన్నూరు క్రాస్, వెంకటగిరి క్రాస్ మీదుగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోకి ఆయన ప్రవేశిస్తారు. భోజనవిరామం అనంతరం తూర్పు పుండ్ల మీదుగా సైదాపురం ఎంట్రన్స్కు ఆయన చేరుకుంటున్నారు. అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. పాదయాత్ర నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్ జగన్కు సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.
వాక్విత్ జగనన్న...
ప్రజాసంకల్పయాత్ర నేడు వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాక్విత్ జగనన్న కార్యాక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్ జగన్ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ ఓ ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
విజయ సంకల్ప స్థూపం...
ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది. ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి రాకకోసం సైదాపురం వాసులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జననేత పాదయాత్ర తమ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటుతుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసేశారు. సైదాపురం గ్రామస్థులు 25 అడుగుల విజయ సంకల్ప స్థూపం ఏర్పాటు చేశారు. దీనిని వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. జన నేతకు ఆహ్వానం పలుకుతూ గ్రామం నిండా ఫ్లైక్సీలు, రంగు రంగుల ముగ్గులు, పూల స్వాగతాలను ఏర్పాటు చేశారు.